అధికార పార్టీలో ఉంటే ఆ మజానే వేరు.ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా పరిస్థితి ఉంటుంది.
ఇక తమ జోలికి ఎవరైనా వస్తే ముందు వెనుకా ఆలోచించకుండా విమర్శల వర్షం కురిపించేస్తుంటారు.అయితే అందుకు భిన్నంగా ఏపీలో అధికార పార్టీ మంత్రుల పరిస్థితి తయారయ్యింది.
ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నతెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ ప్రభుత్వం మీద, తమ అధినేత జగన్ మీద విమర్శల వర్షం కురిపిస్తున్నావారికి తిరిగి కౌంటర్ ఇవ్వలేని పరిస్థితుల్లో అధికార పార్టీ మంత్రులు,నాయకులు పడిపోయారు.
జగన్ తన క్యాబినెట్ ను చాలా జాగ్రత్తగా ఎటువంటి విమర్శలు లేకుండా ఏర్పాటు చేసుకున్నారు.అయితే అలా మంత్రులైన వారు అటు శాఖల్ని సమర్ధవంతంగా నడిపించకుండా ఇటు ప్రతిపక్షాల విమర్శల్ని తిప్పికొట్టకుండా ఎందుకు విఫలమవుతున్నారనేదే అందరిలో ఉన్న ప్రశ్న.అయితే ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ మీద విరుచుకుపడిన వీరంతా ఇప్పుడు మూగనోము చేయడం వెనుక కారణాలు కూడా బలంగానే ఉన్నాయట.
ప్రస్తుతం ఏపీ మంత్రులు చాలామంది ఎటువంటి వివాదాలకు వెళ్ళకూడదు అన్నట్టుగా ఉంటున్నారు.ప్రతిపక్షాల దాడుల్ని, విమర్శల్ని తిప్పి కొట్టడం తమ పని కాదన్నట్లుగా వారు వ్యవహరిస్తున్నారు.చలో ఆత్మకూరు విషయంలో టీడీపీ దూకుడు ప్రదర్శించడం వెనుక రకరకాల కారణాలు ఉన్నాయి.అయితే ఆ కారణాలను హైలెట్ చేసి వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మాత్రం జగన్ ప్రభుత్వం విఫలం అయ్యిందనే చెప్పాలి.
ఎక్కడో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ నుంచి టీడీపీ నేతలు కట్టగట్టుకుని విజయవాడ వరకు వచ్చేస్తే నగరంలోనే ఉన్న వైసీపీ మంత్రులు మాత్రం ప్రతిపక్షాల దూకుడికి బ్రేకులు వెయ్యడం లో విఫలం అయ్యారనే చెప్పాలి.
పేరుకే వీరంతా మంత్రులుగా ఉన్నా వీరు స్వతంత్రంగా ఎటువంటి నిర్ణయాలు కానీ, ఎటువంటి ప్రెస్ మీట్ లు కానీ పెట్టలేని దయనీయ పరిస్థితుల్లో ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.తాము పేరుకి మంత్రులుగా ఉన్నా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ తమకు లేకపోవడంతోనే పెద్దగా యాక్టివ్గా ఉండట్లేదనేది మంత్రులు ఆఫ్ ది రికార్డు గా చెబుతున్నారు.తమ శాఖ తరపునో, విధానపరంగానో, మరో అంశంలోనో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒకరికి పదిమంది సలహా తీసుకోవాల్సి రావడంతో పాటు, సీఎంఓలోనే ముగ్గురికి వివరణ ఇచ్చుకోవాల్సి రావడంతో వీరంతా తమకెందుకు వచ్చిందిలే అన్నట్టుగా సైలెంట్ అయిపోతున్నారు.
ఇదే విధంగా మంత్రులంతా సైలెంట్ గా ఉండిపోతే రానున్న రోజుల్లో టీడీపీ దూకుడు పెరగడం ఖాయం.