ఏపీ రాజధాని అమరావతి విషయం మొదటి నుంచి వివాదాస్పదంగానే మారింది.గత టీడీపీ ప్రభుత్వం అమరావతి లో రాజధాని ఏర్పాటు చేయడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోగా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ రాజధానికి ఆ ప్రాంతం సరైనది కాదు అంటూ విమర్శలు చేస్తూ వచ్చింది.
అయినా అక్కడ కొన్ని కొన్ని నిర్మాణాలను టీడీపీ ప్రభుత్వం పూర్తి చేయగలిగింది.ఇక ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని రగడ మొదలయ్యింది.
ఈ మధ్య కృష్ణ నదికి వరదలు రావడంతో ఆ ఎఫెక్ట్ రాజధాని మీద పడింది.భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతానికి వరదల భయం ఉందనే కారణం చూపిస్తూ వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేయడంతో అప్పటి నుంచి రాజధాని అంశం సంచలనంగా మారింది.
తాజాగా అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులు లేవంటూ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేందర్ నాథ్ ప్రకటించినడంతో ఇది మరోసారి వివాదంగా మారే అవకాశం కనిపిస్తోంది.
ఏపీ అభివృద్ధిని కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం చేయాలి అనుకోవడం సరికాదని, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడంపైనే ఇప్పుడు దృష్టి పెట్టినట్టు భారత్-సింగపూర్ వ్యాపార, ఆవిష్కరణల సదస్సుకు ఏపీ తరపున హాజరైన ఆయన అక్కడ ఓ పత్రిక ఇంటర్వ్యూలో ఈ విషయాన్నీ చెప్పుకొచ్చారు.ఆర్ధిక శాఖామంత్రి బుగ్గిన చెప్పిన దాన్ని బట్టి చుస్తే అమరావతి నిర్మాణం ఇప్పటిలో జరిగేలా కనిపించడం లేదు.నిర్మాణంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ దేశాలు సిద్ధంగా ఉన్నాయి.
కానీ, ప్రస్తుతం నిర్మాణం విషయం పక్కన పెట్టడంతో ఆయా దేశాలు పెట్టుబడుల విషయంలో ఆలోచనలో పడ్డాయి.అయితే అభివృద్ధి అన్నది ఒక్కచోట కాకుండా అన్ని చోట్ల జరగాలని వైసీపీ నాయకులు చెబుతున్నారు.
అమరావతిలో ఆర్థిక నగరం అభివృద్ధికే సింగపూర్ సంస్థలు పరిమితమని బుగ్గన చెప్పుకొస్తున్నారు.అమరావతి విషయాన్ని వైసీపీ ప్రభుత్వం విస్మరించలేదన్న మంత్రి, దీనిపై ఒక నిర్ణయానికి రావడానికి మరికొన్ని నెలల సమయం పడుతుందన్నారు.ప్రస్తుతానికి అభివృద్ధిని వికేంద్రీకరించడంపై తాము దృష్టి పెట్టామన్నారు.అందరికీ సుస్థిర జీవనం, ఉత్పాదక రంగాన్ని అన్నిచోట్లా అభివృద్ధి చేయడం, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి వాటి కల్పనే ప్రభుత్వ ముఖ్య ధ్యేయమన్నారు.
వ్యవసాయాధారిత రాష్ట్రంలో పరిశ్రమలు పెంచుకోవడంపై దృష్టి సారించామని బుగ్గన చెప్పుకొచ్చారు.ఇలా చేయడం వలన అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్తున్నారు.మొత్తంగా ఈ వ్యవహారం చూస్తుంటే అమరావతి వ్యవహారంలో ముందుకు వెళ్లేందుకు వైసీపీ ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపించడంలేదని అర్ధం అవుతోంది.