సుదీర్ఘమైన, ఘనమైన రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నటు కనిపిస్తోంది.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తయారయ్యింది.
తెలంగాణ ప్రజలకు ఎప్పటి నుంచో తీరని కలగా మిగిలిపోయిన ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది.అయినా అక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు జోరందుకోవడంతో పాటు గ్రూపు రాజకీయాలు,నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, నాయకత్వ మార్పులు మొదలయిన గందరగోళ పరిస్థితి, ఇవన్నీ కేడర్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా తయారయ్యాయి.
అది కాకుండా ఒకవైపు అధికార పార్టీ టిఆర్ఎస్, మరోవైపు కేంద్ర అధికార పార్టీ బీజేపీ దూకుడు కాంగ్రెస్ ను మరింత దీన స్థితిలోకి నెట్టేశాయి.
తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకుంటుందని ఆ పార్టీ నేతలు చాలా ధీమా వ్యక్తం చేశారు.టీడీపీ, వామపక్ష పార్టీలతో కలిసి మహాకూటమిగా పొత్తు పెట్టుకుని మరి ఎన్నికలకు వెళ్లింది కాంగ్రెస్ పార్టీ.అయినా అక్కడ పరాజయమే ఎదురయ్యింది.
కేవలం 19 స్థానాల్లో మాత్రమే సీట్లు దక్కించుకోగలిగింది.ఇక గెలిచిన వారిలో కూడా ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ వైపు చూడడం మొదలుపెట్టడం, ఇటీవల 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించి సీఎల్పీని అధికార పార్టీలో విలీనం చేయడం కాంగ్రెస్ హైకమాండ్ ను షాక్ కి గురిచేసింది.
అసెంబ్లీలో టీఆర్ఎస్ ను ప్రశ్నించే స్థాయి కూడా కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోయింది.ఇప్పుడు టిఆర్ఎస్ మీద అసంతృప్తితో ఉన్న నాయకులు కూడా బిజెపిలో చేరాలని అనుకుంటున్నారు తప్ప కాంగ్రెస్ వైపు ఎవరూ చూడకపోవడం ఆ పార్టీ దయనీయ పరిస్థితికి అర్ధం పడుతోంది.
స్థానికంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండడంతో తెలంగాణ విషయాన్ని పట్టించుకునే తీరిక హై కమాండ్ కు లేకుండా పోయింది.ప్రస్తుతం తెలంగాణలో రాజకీయమంతా టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారిపోయింది.ఈ సమయంలో కాంగ్రెస్ గురించి ఆలోచించే నాయకులే కరువైపోయారు.త్వరలో తెలంగాణాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి తెలంగాణ కాంగ్రెస్ రాజకీయt భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.
ఇక తెలంగాణాలో కాంగ్రెస్ బలపడాలంటే నాయకత్వ మార్పు అత్యవసరమని మెజారిటీ నాయకులు అభిప్రాయ పడుతున్నారు.ఈ నేపథ్యంలో పీసీసీ పదవి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుకునేందుకు సిద్ధంగానే ఉన్నా ఇప్పటికిప్పుడు నాయకత్వ మార్పు చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా ఉన్నట్టు కనిపించడంలేదు.