టీఆర్ఎస్ పార్టీ మొదటి సారి అధికారంలోకి వచ్చిన సమయంలో ఆ పార్టీలో ఎలాంటి కలతలు, అలకలు లేవు.కాని రెండవ సారి బంపర్ మెజార్టీతో అధికారం దక్కించుకున్నా కూడా ఆపార్టీలో అధినేతను ధిక్కరించే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.
తాజాగా మంత్రి వర్గం విస్తరణ తర్వాత అవి బాహాటంగా కనిపించాయి.ఈటెలను మంత్రి వర్గం నుండి తప్పించబోతున్నట్లుగా వార్తలు రావడంతో ఆయన తాడో పేడో తేల్చుకుంటాను అన్నట్లుగా మాట్లాడాడు.
ఆయనకు మద్దతుగా రసమయి కూడా వ్యాఖ్యలు చేశాడు.దాంతో ఈటెల స్థానంను అలాగే ఉంచి కేసీఆర్ సేఫ్ అయ్యాను అనుకున్నాడు.
కాని మంత్రి వర్గంలో చోటు రాలేదు అంటూ కొందరు సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఇప్పటికే నాయిని పార్టీ అధినాయకత్వంపై విమర్శలు చేశాడు.
తాజాగా మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్య మాట్లాడుతూ తెలంగాణలో 12 శాతం మంది మాదిగలు ఉంటే మంత్రి వర్గంలో మాత్రం ఒక్కరు లేరంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ కేసీఆర్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు.ఇక తనకు మంత్రి వర్గంలో చోటు దక్కనందుకు గాను పార్టీ వ్యవహారాలకు జోగు రామన్న దూరంగా ఉంటున్నాడు.
గతంలో అటవి శాఖ నిర్వహించిన ఈయనకు తాజాగా మంత్రి వర్గంలో చోటు దక్కలేదు.దాంతో ప్రస్తుతం రామన్న అజ్ఞాతంలో ఉన్నాడు.పార్టీ నేతలు బుజ్జగించేందుకు ప్రయత్నించాలన్నా ఆయన అందుబాటులోకి రావడం లేదు.స్వయంగా కేటీఆర్ ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది.