జనసేన పార్టీ రాజకీయంగా ఎత్తు పల్లాలను చూస్తోంది.ఆ పార్టీ అధినేత పవన్ కు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, సామజిక వర్గం అండదండలు పుష్కలంగా ఉన్నా ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటుకే పరిమితం అయిపోయింది జనసేన పార్టీ.
పవన్ రాజకీయాల్లో అడుగుపెట్టినప్పుడే ఏపీ లో అనేక సంచలనాలు చోటు చేసుకుంటాయని అధికారం చేపట్టే అంత స్థాయిలో కాకపోయినా ఎవరు అధికారంలోకి రావాలన్నా తమ మద్దతు కీలకం అవుతుందని పవన్ భావించారు.అయితే ఫలితాలు మాత్రం అందుకు విరుద్ధంగా వచ్చాయి.
కానీ ఫలితాల తరువాత పవన్ ఎక్కడా వెనక్కి తగ్గినట్టు కనిపించడంలేదు.ఇప్పుడు చేదు ఫలితాలు వచ్చినా ముందు ముందు జనసేనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్న ఉద్దేశంతో పవన్ పార్టీకి మరింత మైలేజ్ తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాడు.
వచ్చే ఎన్నికల సమయం వరకు నిత్యం ప్రజల్లోనే తిరుగుతూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని చూస్తున్నాడు.
తాజాగా జనసేన కీలక నేతలతో పవన్ కీలక సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది.ఈ సందర్భంగా పార్టీకి ప్రజల నుంచి అశేష ఆదరణ రావాలంటే ‘పాదయాత్ర’ చేయాలని మెజార్టీ నాయకులు సూచించారట.అందుకే జగన్ ప్రజాసంకల్ప యాత్ర తరహాలో సుదీర్ఘయాత్రకు ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల వరకు అంటే నాలుగేళ్ల పాటు పాదయాత్ర చేసి ప్రజల్లోనే ఉండాలని భావిస్తున్నారట పవన్.పాదయాత్ర చేసిన నాయకులు తప్పకుండా అధికారంలోకి వస్తారనే సెంటిమెంట్ ఏపీ రాజకీయాల్లో బలంగా ఉంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, జగన్ ఇలా అందరూ అధికారానికి దూరంలోగా ఉన్నప్పుడు కాళ్ల పనిచెప్పి రాష్ట్రమంతా తిరిగారు.ఆ తరువాత అధికారంలోకి వచ్చారు.ఇప్పుడు అదే తరహాలో పాదయాత్ర చేపట్టి ఏపీలోని అన్ని వర్గాలకు చేరువ అవ్వాలని జనసేన అధినేత భావిస్తున్నాడు.
2024 ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండేలా పవన్ ప్లాన్ చేసుకుంటున్నట్టు జనసేన వర్గాల నుంచి అందుతున్న సమాచారం.రాష్ట్ర మొత్తం పాదయాత్ర చేస్తూ అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా రూట్ మ్యాప్తో పాటు సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించాలని పార్టీ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు రెండేళ్ల ముందే జగన్ పాదయాత్ర చేపట్టారు.
దాదాపు 18 నెలల పాటు 134 నియోజకవర్గాల్లో 3,600 కిలోమీటర్లు జగన్ పాదయాత్ర చేశారు.ఈ పర్యటనతో నియోజకర్గాల వారిగా పార్టీ నేతలతో ముఖాముఖీలను ఏర్పాటు చేసుకుంటూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి జగన్ ఎంతగానో శ్రమించారు.
అది ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది.ఆ విధంగానే తానూ పాదయాత్ర చేస్తే బాగుంటుందనే ఆలోచనకు పవన్ వచ్చినట్లు సమాచారం.