వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వందరోజులు దాటింది.అయినా ఆ పార్టీలోని నాయకుల్లో ఎక్కడా ఆ ఉత్సాహం కానీ, ఆనందం కానీ కనిపించడంలేదు.
దీనికి కారణం ప్రభుత్వం కొన్ని కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తూ ఉండడంతో ప్రజల్లో కూడా ఒకరకమైన ఆగ్రహం పెరిగినట్టు ఆ పార్టీ నేతలు గ్రహించేశారు.ఇక ఇదే సమయంలో కేంద్ర అధికార పార్టీ బీజేపీ వైసీపీని టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్తుండడంతో వైసీపీలో ఎక్కడలేని ఆందోళన కనిపిస్తోంది.
అధికారంలోకి వచ్చే వరకు తమకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన బీజేపీ ఇప్పుడు ఒక్కసారిగా యూ టర్న్ తీసుకోవడంతో పాటు తమకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నతెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ స్థాయిలో విమర్శలు చేస్తుండడంతో ఏమిచేయాలో పాలుపోని దుస్థితిలో ఉంది.ప్రతి విషయంలోనూ వైసీపీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.
ప్రధానంగా మతపరమైన అంశాలను తెర మీదకు తీసుకువచ్చి పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతోంది.తిరుమల, శ్రీశైలంలో అన్యమత ప్రచారం జరుగుతోందనే అంశాన్ని హైలెట్ గా చేసుకుని వైసీపీ మీద బురద చాల్లే కార్యక్రమాన్ని చేపట్టిందని వైసీపీ తెగ బాధ పడిపోతోంది.
తాజాగా పాస్టర్ల గౌరవ వేతనానికి సంబందించిన అంశంలో బీజేపీ గుర్రుగా ఉంది.అందుకే ప్రభుత్వ నిధులతో సర్వే ఎందుకు చేయించారని ప్రశ్నిస్తున్న బీజేపీ అన్ని మతాల్లో పేదలు ఉంటే కేవలం పాస్టర్లకే ఐదు వేలు వేతనం ఎలా ఇస్తారంటూ నిలదీస్తోంది.సీఎం జగన్ క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నప్పటికీ ఆయన హిందూ మతాన్ని కూడా అంతే సమానత్వంతో చూస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.హిందూ ఆలయాలకు ఆయన వెళ్తున్నారనీ, పూజలు చేస్తున్నారనీ, హిందూ మతాచార్యుల్ని కూడా జగన్ కలుస్తుంటే బీజేపీ కావాలని ఏపీలో మతపరమైన అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని వైసీపీ వాదిస్తోంది.
ఇదే విధంగా ప్రతి విషయంలోనూ బీజేపీ వైసీపీని ఇబ్బంది పెట్టాలనుకోవడం పెద్ద తలనొప్పిగా మారింది.
ఇక ఏపీ రాజధాని అమరావతి విషయంలోనూ బీజేపీ టీడీపీ కంటే ఎక్కువ స్థాయిలో విమర్శలు చేస్తోంది.ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నాయకులు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.రాజధానిని తరలించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ విషయాల్లో బీజేపీ అగ్రనేతల నుంచీ రాష్ట్ర నేతలకు స్పష్టమైన ఆదేశాలొచ్చినట్లు తెలుస్తోంది.త్వరలో జరగనున్నస్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూడా బీజేపీ హవా చూపించేందుకు ఈ విధంగా విమర్శలు చేస్తున్నట్టు వైసీపీ అనుమానిస్తోంది.
అయితే బీజేపీ ఎన్ని విమర్శలు చేసినా ఆ స్థాయిలో వైసీపీ విమర్శలు చేయలేకపోవడానికి అనేక రాజకీయ కారణాలు అద్దంపడుతున్నట్టు తెలుస్తోంది.