ఏపీ రాజధాని అమరావతి విషయంలో కొద్ది రోజులుగా జరుగుతున్న హడావుడి అంతా ఇంతా కాదు.ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ అన్ని పార్టీలు విమర్శలు చేశాయి.
ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా అన్నట్టుగా జనసేన, బీజేపీలు కూడా గొంతెత్తి వైసీపీ మీద విమర్శల రాళ్లు విసిరాయి.ముఖ్యంగా టీడీపీ నుంచి బీజేపీ లో చేరిన సుజనా చౌదరి వైసీపీని కార్నర్ చేసాడు.
ఆ తరువాత కన్నా లక్ష్మి నారాయణ, తదితరులు దీనిపై విమర్శలు చేశారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఈ నెలాఖరున రాజధాని రైతులతో మీటింగ్ కూడా పెట్టబోతున్నాడు.
కేంద్ర అధికార పార్టీ అండ దొరికిందన్న ఆశతో టీడీపీ, జనసేన ఉండగానే ఇప్పుడు బీజేపీ విషయంలో వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తోంది.తాజాగా అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ మాట్లాడ్డం సంచలనంగా మారింది.
రాజధానిని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తే తామేమి జోక్యం చేసుకోబోమని ఎంపీ జీవీఎల్ అన్నారు.అలాగే మరో ఏపీ బీజేపీ కీలక నాయకుడు సోము వీర్రాజు రాజధాని వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించారు.చంద్రబాబు మోళీ చేసి తాయత్తులు అమ్మాలని చూశారని అవి కొనుక్కుని అంతా బుక్ అయిపోయినట్లు ఎద్దేవా చేశారు.రియల్ ఎస్టేట్ వ్యాపారంగా ఏపీ రాజధాని తయారయ్యిందని గతంలో చెప్పిందే ఆయన స్పష్టం చేశారు.
ఆయారాం గయారాం ల మాటలతో పార్టీకి సంబంధం లేదని వైసిపి ప్రభుత్వం టిడిపి అవకతవకలు బయటపెట్టి కేసులు మాత్రం ఎందుకు పెట్టడంలేదంటూ ప్రశ్నించారు.రెండు పార్టీలు లాలూచి అయిపోయారా అంటూ నిలదీశారు.
వైసిపి ని విమర్శించే నైతిక హక్కు టిడిపికి లేదని, దాని గురించి ఏది మాట్లాడినా బిజెపి మాత్రమే మాట్లాడుతుందంటూ స్పష్టం చేశారు.
అయితే తమకు ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా ఈ విషయంలో ముందుకు వెళ్లేందుకు టీడీపీ సిద్ధం అవుతున్నట్టుగానే ఉంది.ప్రస్తుతం బీజేపీ వైకిరి మారడంతో జనసేన ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనే విషయంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేగుతోంది.ఆగస్ట్ 30, 31 తేదీల్లో పవన్ కళ్యాణ్ అమరావతిలో పర్యటించడానికి రెడీ అవుతున్నారు.
అమరావతి రాజధానికోసం భూములిచ్చిన రైతులను కలుస్తారు.జీవీఎల్ వ్యాఖ్యలను పరిశీలిస్తే అమరావతి విషయంలో జగన్ ఏం చేసినా ఇక రాష్ట్ర బీజేపీ జోక్యం చేసుకోకపోవచ్చని అర్ధం అవుతోంది.
అంటే రాజధాని మార్పు చేర్పుల విషయంలో జగన్ కు పూర్తి స్వేచ్ఛ లభించినట్టే అర్ధం అవుతోంది.కొద్ది రోజుల క్రితం జగన్ బీజేపీ అగ్ర నాయకులతో భేటీ అవ్వడం, రాష్ట్రంలో నెలకొన్న విషయాలపై క్లారిటీ ఇవ్వడం ఇవన్నీ జరిగిన నేపథ్యంలో బీజేపీలో ఉన్న బాబు కోటరీ నాయకులుగా పేరుపడ్డ కొంతమందిపై అధిష్టానం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.
తాజాగా అధిష్టానం వైకిరికి అనుగుణంగానే జీవీఎల్ వ్యాఖ్యలున్నట్టుగా కనిపిస్తోంది.