లక్షలు, కోట్లు అప్పులు చేసి కనిపించకుండా పోయేవారు ఎంతో మంది ఉన్నారు.ఇక బ్యాంకుల వద్ద వేల కోట్ల అప్పులు చేసి ఎగవేసిన వారు ఇండియాలో ఎంతో మంది ఉన్నారు.
ఒకప్పుడు డబ్బులు లేక అప్పులు చేసిన వారు, ఆతర్వాత డబ్బులు వచ్చిన తర్వాత కూడా ఆ అప్పును తీర్చేందుకు సిద్ద పడరు.పదుల సంవత్సరాల క్రితం అప్పును వారు మర్చిపోయిన తర్వాత ఇప్పుడు తీర్చడం అవసరమా అని చాలా మంది అనుకుంటారు.
కాని కెన్యాకు చెందిన రిచర్డ్స్ మాత్రం అలా అనుకోలేదు.
కెన్యాకు చెందిన రిచర్డ్స్ దాదాపు 22 ఏళ్ల క్రితం మహారాష్ట్రలోని ఔరంగాబాద్లోని మౌలానా ఆజాద్ కాలేజ్లో చదువుకున్నాడు.ఆ సమయంలో అతడి ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కరంగా ఉండేది.అయినా కూడా సింగిల్ రూంలో ఉంటూ కష్టాలు పడి చదువుకున్నాడు.
ఆ సమయంలోనే కీరాణా సామాను అమ్మే ఒక షాపులో వెయ్యి లోపు అప్పు చేశాడట.చదువు పూర్తి అయిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఆ డబ్బు చెల్లించకుండానే తన దేశంకు వెళ్లి పోయాడు.
చదువు పూర్తి చేసుకుని కెన్యా వెళ్లి పోయిన రిచర్డ్స్ అక్కడ కొంత కాలం ఉద్యోగం చేసి రాజకీయాల్లోకి వెళ్లాడట.అక్కడ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఎదిగాడు.ప్రస్తుతం ఈయన కెన్యా విదేశీ వ్యవహారాల సమితి అధ్యక్షుడిగా ఉన్నాడు.తాజాగా ప్రధాని మోడీతో భేటీ అయ్యేందుకు వచ్చిన రిచర్డ్స్ బృందం భేటీ తర్వాత ఔరంగాబాద్కు వెళ్లాడు.
అక్కడ తనకు అప్పు ఇచ్చిన వారిని వెదికి మరీ పట్టుకుని వారికి డబ్బు ఇచ్చేశాడు.అలాగే వారికి ఇన్నాళ్లు వెయిట్ చేయించినందుకు క్షమాపణలు చెప్పాడు.
అప్పటి డబ్బుకు వడ్డీతో కలిపి దాదాపు 20,000 రూపాయల వరకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.ఆయన ఇచ్చిన మొత్తంను పక్కకు పెడితే ఒక గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి తమ ఇంటికి రావడం పట్ల ఆ షాపు యజమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇతడిపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇతడు నిజాయితి అనేదానికి రూపం ఉంటే నిలువెత్తు నిదర్శనం అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.