నందమూరి బాలకృష్ణ ఈమద్య కాలంలో సరైన సినిమాలను ఎంపిక చేసుకోవడం లేదు.గత దశాబ్ద కాలంగా చూస్తే ఆయన సక్సెస్లను చేతి వేళ్లపై లెక్కించొచ్చు.
ముఖ్యంగా ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మరియు మహానాయకుడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎంతటి దారుణ పరాభవంను చవి చూశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అలాంటి పరిస్థితుల్లో బాలయ్య తన తదుపరి చిత్రాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
కాని ఆయన మాత్రం పెద్దగా ఆలోచన లేకుండా వ్యవహరిస్తున్నట్లుగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రస్తుతం బాలకృష్ణ తమిళ దర్శకుడు రవికుమార్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు.
గత ఏడాది జైసింహా అంటూ అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో మళ్లీ సినిమా చేయడం అంటే కొరివితో తల గోక్కున్నట్లే.అయినా కూడా బాలయ్య ఏ నమ్మకంతో ఆయనకు సినిమా ఛాన్స్ ఇచ్చాడో ఆయనకే తెలియాలి.
ఇక తాజాగా ‘పింక్’ రీమేక్కు బాలయ్య ఓకే చెప్పాడు అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.లాయర్ పాత్రను బాలయ్య పోషించేందుకు సిద్దం అవుతున్నాడట.
బాలీవుడ్ లో సెన్షేషనల్ హిట్ అయిన పింక్లో అక్కడ అమితాబచ్చన్ నటించాడు.తమిళంలో ప్రస్తుతం రీమేక్ జరుగుతుంది.కోలీవుడ్లో అజిత్ నటిస్తున్నాడు.ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో పింక్ చిత్రం ఉంటుంది.అలాంటి సినిమాను దిల్రాజు రీమేక్ చేసేందుకు రైట్స్ కొనుగోలు చేశాడని, త్వరలోనే రీమేక్ పనులు మొదలు పెడతాడని అంటున్నారు.రీమేక్ కోసం బాలయ్యను సంప్రదించగా ఈ ఏడాది చివర్లో డేట్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది.
అయితే ఫ్యాన్స్ మాత్రం బాలయ్య ‘పింక్’ రీమేక్ లో నటించడంపై వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు.ఆ సినిమా కథకు బాలయ్యకు అసలు సెట్ అవ్వదు అంటున్నారు.
మరి బాలయ్య ఫైనల్ నిర్ణయం ఏంటో తెలియాల్సి ఉంది.