ప్రస్తుతం రాజకీయంగా చూస్తే టీడీపీ పుట్టెడు కష్టాల్లో ఉన్నట్టే కనిపిస్తోంది.ఒకవైపు జగన్ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూనే మరోవైపు పార్టీ నాయకులు చేజారిపోకుండా చూసుకునేందుకు అధినేత చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.
ఏది ఏమైనా పార్టీలో ప్రస్తుతం నెలకొన్న నిస్తేజాన్ని పూర్తిగా తొలగించాలని బాబు చూస్తున్నాడు. ఒకవైపు జగన్ ప్రభుత్వం టీడీపీ విషయంలో దూకుడు పెంచింది.
టీడీపీ హయాంలో జరిగిన అవకతవకలన్నీ బయటకి తీసేందుకు ఏకంగా క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.ఇవన్నీ ప్రస్తుతం టీడీపీ నాయకుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
రానున్న రోజుల్లో టీడీపీ నాయకులకు కష్టాలు తప్పవేమో అన్న ఆందోళన కూడా వారిలో బలంగా నాటుకుపోయింది.
ఆ భయంతోనే జగన్ ప్రభుత్వం మీద గట్టిగా విమర్శలు చేసేందుకు టీడీపీ నాయకులు జంకుతున్నారు.అందుకే పార్టీలో ఒకరిద్దరు నాయకులు తప్ప జగన్ మీద గట్టిగా విమర్శలు చేసేవారు కరువయ్యారు.అదే సమయంలో సొంత పార్టీ మీద ఉన్న అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేయడానికి కూడా వెనుకాడడంలేదు.
ఇటీవల జరిగిన కీలక పరిణామం దీనికి బలం చేకూరుస్తోంది.చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా కాకినాడ కేంద్రంగా కాపు సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకులు మీటింగ్ పెట్టుకున్న సంగతి తెలిసిందే.
ఈ మీటింగ్ లో పార్టీలో జరుగుతున్న పరిణామాలు, నిర్ణయాల మీద చాలామంది నాయకులు తమ అసంతృప్తిని బాహాటంగా ప్రకటించారట.
ఇప్పటివరకు పార్టీలో చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ గా ఉంటూ వచ్చింది.ఆయన ఏమి చెప్తే అదే నడిచింది.ఎవరూ బాబు మాట జవదాటే వారు కాదు.
అయితే ఇప్పుడు బాబు వయస్సు మీద పడడంతో చినబాబు లోకేష్ ను గట్టిగా ప్రమోట్ చేయాలనీ బాబు డిసైడ్ అయ్యారు.ఇప్పటికే తన ప్రభుత్వంలో బాబు తరువాతి స్థానం లోకేష్ దే అన్నట్టుగా వ్యవహారాలూ నడిచాయి.
రాబోయే రోజుల్లో నారా లోకేష్ ను టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేసే అవకాశం కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతుండడంతో తెలుగు తమ్ముళ్లు కలవరం చెందుతున్నారు.పార్టీ నాయకులు ఎంత చెప్పినా బాబు లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగించడం ఖాయం అని, లోకేష్ కు పార్టీని నడిపించే అంత శక్తీ, సామర్ధ్యం లేదని, అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించేది లేదని, అదే జరిగితే.
తమ దారి తాము చూసుకునేందుకు సిద్ధమని అంతర్గత చర్చల్లో పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారట.