సినిమా రంగంలో వచ్చిన పేరు ప్రఖ్యాతులు ఉపయోగించుకుని రాజకీయాలలో గుర్తింపు సంపాదించాలని, రాజకీయ నాయకుడిగా, ప్రజలతో ఆమోదముద్ర వేయించుకుని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాష్ట్ర పరిపాలకుడిగా మారాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు.తెలుగు తమిళ రాజకీయాలలో సినిమాలకి, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంటుంది.
సినిమాలలో మాస్ హీరోగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోలు తర్వాత రాజకీయాలలో కూడా ప్రవేశించి తమ సత్తా చూపించే ప్రయత్నం చేశారు.ఈ కోవలోనే తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి లాంటి రాజకీయ ఉద్దండులు అక్కడ పార్టీలు పెట్టి అధినేతలుగా మారి ప్రజామోదంతో ముఖ్యమంత్రులుగా చేశారు.
ఏపీలో కూడా స్వర్గీయ ఎన్టీఆర్ స్టార్ హీరో స్థాయి నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఏపీ ముఖ్యమంత్రిగా పని చేశారు.ఇదే దారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టి తన సత్తా నిరూపించుకునే ప్రయత్నం చేసిన తరువాత రాజకీయాలు తనకు సరిపోవని వాటికి దూరం అయ్యారు.
ఇక వీళ్ల స్ఫూర్తితోనే తమిళనాడులో ఒకప్పటి స్టార్ హీరో విజయ్ కాంత్ పార్టీ పెట్టి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసిన సక్సెస్ కాలేకపోయారు.ప్రస్తుతం పార్టీని నడపలేని స్థితిలో ఉన్నారు.
ఇదిలా ఉంటే రాజకీయాలలోకి వచ్చిన తర్వాత మొత్తం పోగొట్టుకొని అప్పులపాలైన విజయ్ కాంత్ ఇప్పుడు వాటికోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది.రాజకీయ పార్టీ కోసం గతంలో ఓ బ్యాంకు దగ్గర భారీ మొత్తంలో అప్పు తీసుకున్న విజయ్ కాంత్ వాటిని తీర్చకపోవడం తో ఇప్పుడు బ్యాంకు అతని ఇంటిని, అలాగే కాలేజీని జప్తు చేసి అమ్మకానికి పెట్టింది.
ఇప్పుడు ఈ సంఘటన ఒక్కసారిగా బయటకు రావడంతో తమిళనాడు రాజకీయాలలో సంచలనంగా మారింది.ప్రస్తుతం విజయ్కాంత్ ఆరోగ్య పరిస్థితి బాగోక పోవడంతో అతను చికిత్స పొందుతున్నారు.ఇలాంటి సమయంలో అతని ఆస్తులు బ్యాంకు అమ్మకానికి పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.