హైదరాబాద్ లో మొన్నా మధ్య డ్రగ్స్ కలకలం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.రెండేళ్ల క్రితం ఈ డ్రగ్స్ కేసు టాలీవుడ్ ని కూడా తాకడం తో తీవ్ర కలకలం నెలకొంది.
పలువురు సినీ ప్రముఖులు ఈ వ్యవహారంలో విచారణ ఎదుర్కొన్నారు.అయితే ఈ డ్రగ్స్ కేసు కు సంబంధించి మొత్తం 12 కేసులు నమోదు కాగా,4 కేసుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు ఎక్సయిజ్ అధికారులు తెలిపారు.
సమాచార హక్కు చట్టం కింద ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభ రెడ్డి టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ వివరాలు కోరగా పై మేరకు ఎక్సయిజ్ అధికారులు తెలిపారు.ఇప్పటివరకు 4 కేసుల్లో ఛార్జ్ షీట్ లను దాఖలు చేశామని,మరో 8 కేసుల్లో ఛార్జ్ షీట్ లు దాఖలు చేయనున్నట్లు తెలిపారు.
అయితే ఈ కేసులో మొత్తం 62 మంది సినీ ప్రముఖులను విచారించినట్లు ఆ నివేదిక లో తెలిపారు.పలువురు సినీ హీరోలు, హీరోయిన్స్, దర్శకులు, నటులతో పాటు పలువురు ప్రముఖుల నుండి గోర్లు, వెంట్రుకల నమూనాలను సేకరించిన సిట్ అధికారులు వారి పేర్లను మాత్రం ఛార్జిషీట్లో చేర్చలేదని సమాచారం.
రెండేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన పై సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు జరిపినప్పటికీ ఆ తరువాత క్రమంగా ఈ డ్రగ్స్ వ్యవహారం మరుగున పడిపోయింది.అయితే ఇప్పడు తాజాగా ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మ నాభ రెడ్డి సమాచార హక్కు చట్టం కింద మళ్లీ ఆ కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అధికారులు దాఖలు చేసిన నాలుగు ఛార్జిషీట్లలో ఒకటి దక్షిణాఫ్రికా పౌరుడు రఫెల్ అలెక్స్ విక్టర్ పై ఉంది.ముంబయి నుంచి హైదరాబాద్ కు కొకైన్ తరలిస్తున్నాడని అలెక్స్ విక్టర్ ను ఆగస్టు 2017లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.