ఇటీవల శ్రీలంక లో ఈస్టర్ సండే రోజున వరుస పేలుళ్ల ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ ఘటన లో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా,400 మందికి పైగా క్షతగాత్రులు అయ్యారు.
అయితే ఈ ఘటనకు సంబంధించి ఒక మత గురువును అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.సౌదీ లో విద్యాభ్యాసం పూర్తి చేసి శ్రీలంక లో మత బోధకుడిగా ఉన్న మహమ్మద్ అలియార్ అనే వ్యక్తి ని అధికారులు అరెస్ట్ చేశారు.
ఇటీవల చోటుచేసుకున్న శ్రీలంక ఉగ్రదాడుల లో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న జహ్రాన్ హషీమ్ తో మత గురువు అలియార్ కు సంబంధాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
శ్రీలంక తూర్పు తీరంలో ఉన్న కట్టంకుడి పట్టణంలో అలియార్ కు ఇస్లామిక్ గైడెన్స్ అనే సంస్థ ఉంది.
అంతేకాకుండా అదే పట్టణంలో అలియార్ కు ఒక మత పాఠశాల, లైబ్రరీ ఉండడమే కాకుండా ఆయన ఆధ్వర్యంలోనే ఒక మసీదు కూడా నడుతున్నట్లు అధికారులు గుర్తించారు.శ్రీలంక తూర్పు తీరంలోని ఈ పట్టణంలో ముస్లింల ఆధిపత్యం ఎక్కువ.
అయితే అలియార్ కు హషీమ్ తో సంబంధాలు ఉన్నాయని,ఆర్ధిక లావాదేవీలు కూడా నిర్వహించినట్లు తమకు సమాచారం ఉందని పోలీసులు పేర్కొన్నారు.ఈస్టర్ సండే రోజున చోటుచేసుకున్న ఈ ఘటన నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం అప్రమత్తమై అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.
ఈ ఘటన నేపథ్యంలో అన్నీ ప్రభుత్వ సంస్థలకు 15 రోజుల పాటు సెలవులు ప్రకటించింది కూడా.దానితో పాటు సోషల్ మీడియా పై కూడా బ్యాన్ విధిస్తూ చర్యలు చేపట్టింది.