రాజకీయాలు ఎప్పుడూ డబ్బు చుట్టూనే తిరుగుతుంటాయి.నాయకులుగా ఎదగాలన్నా, రాజకీయాల్లో రాణించాలన్నా అంతా డబ్బు మహిమే అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి.
ఇక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలుపు తమ ఖాతాలో వేసుకోవాలంటే ఎంత ఖర్చుపెట్టగలరు ? ఓటర్లకు ఎంత డబ్బు పంచగలరు అనే దాని ఆధారంగా గెలుపు అనేది డిసైడ్ అయ్యే పరిస్థితి.ఇక విషయానికి వస్తే ఏపీలో ఎన్నికల సందడి దాదాపు ముగింపుకి వచ్చేసింది.
నిన్నటితో ఎన్నికల ప్రచారం ముగిసిపోయింది.ఆ తరువాతి ఘట్టం ఓటర్లకు డబ్బు పంపిణి నే.ప్రతి నియోజకవర్గంలో ప్రత్యర్థుల బలాబలాను బట్టి ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు.ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రేటు ఫిక్స్ చేసుకున్నారు.
ప్రత్యర్థి పార్టీలు ఎంత పంచితే మిగతా పార్టీలు కూడా అంతే పంచేస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా డబ్బు పంపిణి నిన్నటి నుంచే మొదలయిపోయింది.
ఎన్నికల సంఘం ఎంత నిఘా ఏర్పాటు చేసినా డబ్బు పంపిణి మాత్రం ఆగడంలేదు.ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే వివాద పార్టీలు ఓటర్లకు పంచుతున్న ట్లలో దొంగనోట్లు వస్తుండడంతో కలకలం రేగుతోంది.
కొన్ని అసలు నోట్లతో కలిపి దొంగనోట్లను ఇచ్చేస్తున్నారట.ఇప్పటికే నర్సీపట్నం, అరకు, పాడేరు, రాజోలు, జగ్గంపేట, కొవ్వూరు నియోజకవర్గాల్లో చాలా చోట్ల ఈ దొంగనోట్ల పంపకాలు జరిగిపోయినట్టు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
ఓటుకు మూడు వేల నుంచి ఐదువేల వరకూ ఇచ్చే చోట్ల ఎక్కువగా ఈ నకిలీ నోట్లు పంచుతున్నట్టు తెలుస్తోంది.గోదావరి జిల్లాలు, విశాఖ, అనంతపురం జిల్లాల్లోనూ ఇదే తంతు సాగుతోందట.
అయితే ఈ వ్యవహారంపై ఎక్కడా పోలీసులకు ఫిర్యాదులు అయితే అందలేదు.చాలా చోట్ల అవి నకిలీ నోట్లు అని తెలియక ప్రజలు వాటిని తీసుకుంటున్నారు.అనుమానించి అడిగిన వారికి నాయకులు సర్ది చెబుతున్నారు.పొరపాటున వచ్చాయి తర్వాత మార్చి ఇస్తాము.ఓటు మాత్రం వేయండని చెప్పేసి మెల్లగా జారుకుంటున్నారు.కొంతమంది మాత్రం ఈ విషయాన్ని మీడియాకు, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అంటే, ఓటుకు డబ్బులు తీసుకుంటే ఇచ్చిన వారినీ, పుచ్చుకున్నవారినీ కూడా జైల్లోపెడతారని ఆ తరువాత మీ ఇష్టం అంటూ బెదిరింపులకు దిగుతున్నారు.
రాష్ట్రము మొత్తం మీద ఎనిమిది జిల్లాల్లో ఈ నకిలీ నోట్ల వ్యవహారం జరుగుతున్నట్టు తెలుస్తోంది.