ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీల వర్షం చూస్తుంటే ప్రజలు ఓటేస్తే చాలు అన్నం మేమే వండి మేమే వడ్డిస్తాం అన్నట్టుగా నాయకుల హామీలు ఉంటున్నాయి.ఈ నేపథ్యంలో అసలు నాయకులు ప్రకటిస్తున్న హామీలు ఎంతవరకు అమలు సాధ్యం అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.
రాష్ట్ర బడ్జెట్ ని మించి ప్రకటిస్తున్న హామీలు చూస్తుంటే అంత సొమ్ము ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనే సందేహం కూడా అందరిలోనూ కలుగుతోంది.నాయుకులు ప్రకటిస్తున్న వాటిలో ఎక్కువ ఉచిత పథకాల హవానే ఎక్కువ కనిపిస్తోంది.
ముఖ్యంగా ప్రతీ ఇంటికి నగదు బదిలీ.పిల్లలను బడికి పంపితే డబ్బులు.
రోగం వస్తే డబ్బులు.ఇరవై ఏళ్లకే పెన్షన్లు ఇలా ప్రజలను ఆకట్టుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు.
ఏపీ ఆర్ధిక పరిస్థితి చూస్తే అంతంతమాత్రంగానే ఉంది.అప్పులు చేసి సంక్షేమ పథకాలకు ఖర్చుచేయాల్సిన పరిస్థితి ఉంది.ఇలా చేయడంవలన రోజు రోజుకి అప్పుల భారం పెరుగుతుంది.కానీ అప్పు చేసి సంపద సృష్టిస్తే.
దాని మీద వచ్చే సంపదతో అప్పు తీర్చవచ్చు.కానీ నాయకులు ఎవరూ ఆ విధంగా చేయడంలేదు.
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో అత్యధిక భాగం సంక్షేమంగా చెప్పబడుతున్న జనాకర్షక పథకాలకు ఖర్చు చేస్తున్నారు.సాధారణ అభివృద్ధి పనులకు కూడా నిధులు ఉంచుకోవడం లేదు.
ఏపీలో ప్రధానంగా పోటీపడుతున్న వైసీపీ, టీడీపీ లు పోటీపడి మరీ ప్రజాకర్షక పథకాలను తమ మానిఫెస్టోలో ప్రకటించాయి.దానిలో ఒకటి పిల్లల్ని బడికి పంపిస్తే డబ్బులివ్వడం.వైసీపీ పదిహేను వేలు, టీడీపీ పద్దెనిమిది వేలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించాయి.వైసీపీ అమ్మ ఒడి, టీడీపీ అమ్మకు వందనం అని పేర్లు కూడా పెట్టారు.బడికి పంపుతారు సరే మరి చదువులు సరిగ్గా చెబుతున్నారా, పిల్లలకు మెరుగైన విద్య అందించే స్కూళ్లను తయారు చేసేవిధంగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అంటే అది మాత్రం ఎక్కడా కనిపించడంలేదు.వాస్తవంగా చెప్పాలంటే ఈ పథకం అందరికి అవసరం లేదు.
ఆర్థిక పరిస్థితుల కారణంగా బడికి పంపలేని కుటుంబాలకు, కటిక పేదరికంలో ఉన్న వారికి ఈ పథకం అమలు చేస్తే ఉపయోగం ఉంటుంది కానీ నాయకులు ఆ విధంగా హామీ ఇవ్వలేకపోతున్నారు.ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పథకంలోనూ ఇటువంటి లొసుగులెన్నో కనిపిస్తున్నాయి.