రాష్ట్ర రాజకీయాల సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు అందరి దృష్టంతా గుంటూరు జిల్లా మంగళగిరి మీదే ఉంది.దీనికి కారణం కూడా ఉంది.
ఈ నియోజకవర్గం నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్, వైసీపీ నుంచి ఆళ్ళ రామకృష్ణ రెడ్డి పోటీ చేస్తుండటమే.టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆర్కే ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తూ వచ్చారు.
టీడీపీ చేపట్టిన ప్రతి పనిలో ఉన్న లోపాలను వెతికి పట్టుకుని మరీ కోర్టుకు ఈడ్చడం చేస్తూ ఉండేవారు.దీంతో ఇక్కడి ఎన్నికల్లో గెలుపు పై అందరికి ఆసక్తి పెరిగిపోయింది.
ఈ నియోజకవర్గం రాజధాని ప్రాంతంలో ఉండడం, లోకేష్ గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది అని ప్రజలు నమ్ముతారు అనే కోణంలో టీడీపీ ఉండగా, ప్రజల్లో బలమైన ముద్ర వేయించుకుని నిరంతరం ప్రజల కోసం పాటుపడే ఆర్కే తప్పకుండా గెలుస్తారు అనే కోణం లో వైసీపీ ఉంది.
మంగళగిరి అసెంబ్లీ స్ధానంలో ఈసారి జరుగుతున్న ఎన్నికలు టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీగా సాగేలా కనిపిస్తున్నాయి.
కోర్ క్యాపిటల్ పరిధిలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో మంగళగిరి మినహాయించి మిగతా చోట్ల టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలే పోటీలో ఉన్నారు.పెదకూరపాడు నుంచి కొమ్మాలపాటి శ్రీధర్, సత్తెనపల్లి నుంచి స్పీకర్ కోడెల శివప్రసాద రావు, తాడికొండ నుంచి తెనాలి శ్రవణ్ కుమార్ టీడీపీ అభ్యర్ధులుగా పోటీలో ఉన్నారు.
మంగళగిరిలో మాత్రమే టీడీపీ తరుపున పోటీ చేసిన గంజి చిరంజీవి 12 ఓట్ల స్వల్ప తేడాతో గత ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.అందుకే ఇప్పుడు గంజి చిరంజీవికి బదులుగా లోకేష్ ను టీడీపీ బరిలోకి దింపింది.
వైసీపీ అభ్యర్థి ఆర్కే కు ఉన్న అనుకూల పరిస్థితులను ఒకసారి పరిగణలోకి తీసుకుంటే మంగళగిరిలో ఐదేళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉండటం ఆర్కేకు కలిసొచ్చే అంశం.ఆయన ప్రతిపక్షంలో ఉండటం వల్ల ఐదేళ్లుగా ప్రజలతో కలిసి రాజధాని భూ సేకరణకు వ్యతిరేకంగా చేసిన పోరాటంతో పాటు నియోజకవర్గంలో ప్రభుత్వం ఐదు రూపాయల భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్ల కంటే ముందుగానే స్ధానికంగా నాలుగు రూపాయలకే భోజనం అందించే రాజన్న క్యాంటీన్ ప్రారంభించడం ఆయనకు అదనపు ఇమేజ్ ను తీసుకొచ్చాయి.ఇక లోకేష్ విషయానికి వస్తే మంగళగిరి నియోజకవర్గానికి కొత్తే అయినా స్ధానికంగా టీడీపీకి ఉన్న బలమైన క్యాడర్ ఆయనకు కలిసి వచ్చే అంశంగా టీడీపీ భావిస్తోంది.నియోజకవర్గంలో ఇప్పటికే ఆయన విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు.
ప్రజల్లో కూడా సీఎం కుమారుడిగా ఆయనకు సానుకూల స్పందనే కనిపిస్తోంది.