ఏపీలో ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తోంది.ఇంకా పట్టుమని 20 రోజుల సమయం కూడా లేదు.
రాజకీయ పార్టీలన్నీ ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఓట్ల రాజకీయం చేస్తున్నాయి.ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిత్యం ప్రజల్లో ఉంటూ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేస్తూ హడావుడి చేస్తున్నాడు.
కార్యకర్తల్లోనూ , ప్రజల్లోనూ హుషారు పెంచుతూ పర్యటనల మీద పర్యటనలు చేస్తున్నాడు.కానీ ఈ విషయంలో వైసీపీ వెనుకబడీఫైపోయినట్టు కనిపిస్తోంది.చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్ ఎక్కువగా ప్రచారం చేయడం లేదు.జగన్ మూడు నెలల క్రితం వరకు పాదయాత్రతో ప్రజల్లోనే ఉన్నారు.అయితే, అది ఎన్నికల ప్రచారం కిందకు రాదు.ఎన్నికల వాతావరణం వచ్చాక చేసిన ప్రచారం ప్రజల్లోకి ఎక్కువగా వెళుతోంది.
ఈ విషయంలో జగన్ కంటే చంద్రబాబు ముందున్నట్టు కనిపిస్తోంది.
రేయనక పగలనక చంద్రబాబు నిత్యం ప్రజల్లోనే మునిగిపోతున్నారు.చంద్రబాబు కి మీడియా బలం కూడా బాగా కలిసివస్తోంది.ఉదయం నుంచే టీడీపీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఆయన అందులో ఏం మాట్లాడారో అది మీడియాలో బాగా హైలెట్ అవుతుంది.
టీడీపీ ఎన్నికల ప్రకటనలు కూడా న్యూస్ ఛానళ్లతో పాటు ఎంటర్టైన్మెంట్ ఛానళ్లలో అదేపనిగా హోరిత్తిస్తున్నారు.బాబు తన పాలనలో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తూ ఇప్పుడు చేసిన అభివృద్ధి తో పాటు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తానో కూడా చెప్తూ ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్నాడు.
చంద్రబాబు కంటే ఒక రోజు తర్వాత జగన్ ప్రచారాన్ని ప్రారంభించారు.నాలుగు రోజుల పాటు రోజుకు మూడు చోట్లే ప్రచారం నిర్వహించారు.తర్వాత ఓ రోజు మేనిఫెస్టో తుది కసరత్తు కోసం, మరో రోజు నామినేషన్ కోసం ప్రచారానికి విరామం ప్రకటించారు.దీనికి తోడు జగన్ కు మీడియా బలం కూడా తక్కువగా ఉండటంతో అయినా ప్రచారం చేసుకున్నా హైలెట్ అవ్వడంలేదు.
అసలుకే జగన్ తక్కువ సభలు నిర్వహిస్తుండటం, అవీ పెద్దగా మీడియాలో హైలెట్ కాకపోతుండటంతో చంద్రబాబు ప్రచారం మాత్రమే ఏకపక్షంగా ప్రజల్లోకి వెళుతోంది.ఈ విషయాన్ని పసిగట్టిన జగన్ ఇక ఎన్నికల ప్రచారంహోరెత్తించాలని చూస్తున్నాడు.
తన తల్లి విజయమ్మ , సోదరి షర్మిలతో పాటు స్టార్ క్యాంపెనర్లు అందరిని రంగంలోకి దించాలని చూస్తున్నాడు.