వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడు.వాస్తవంగా చెప్పాలంటే ఈ ఎన్నికలు వైసీపీ కి చావో రేవో అన్న పరిస్థితి.
అందుకే అలుపెరగకుండా జగన్ కష్టపడుతున్నాడు.అయితే ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్ చేస్తున్న ప్రసంగాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
యాత్ర సినిమాలో ఉన్న కొన్ని డైలాగులను జగన్ తన ప్రసంగాల్లో వాడేస్తున్నారు.ముఖ్యంగా ‘నేను విన్నాను , నేను ఉన్నాను’ అనే డైలాగును పదే పదే వాడేస్తున్నారు.
తాజాగా రాయచోటిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగన్, ఇదే డైలాగ్ చుట్టూ తన ప్రసంగాలు చేశారు.రైతుల కష్టాలను తాను చూశాననీ, వారి గుండె చప్పుళ్లు విన్నాననీ, నేనున్నానని డైలాగు చెప్పారు.
మహిళల కష్టాలు చూశాననీ, వారి బాధలు విన్నానని, నేనున్నానని అన్నారు! వృద్ధుల ఇబ్బందుల్ని కళ్లారా చూశాననీ, వారి ఆవేదన విన్నాననీ.నేనున్నానని చెప్పారు.ఇలా ప్రతి దశలోనూ సినిమా డైలాగులను చెప్పడం కొంత బోర్ కొట్టిస్తోంది.అసలే పోలింగ్ తేదీ దగ్గరకు వచ్చేస్తోంది.ఈ సమయంలో ప్రసంగాల్లో ఈ సినిమా ప్రయోగాలు అవసరమా అనే చర్చ కూడా నడుస్తోంది.వాడి వేడి ప్రసంగాలతో ప్రత్యర్థి పార్టీలను ముప్పు తిప్పలు పెట్టాల్సిన సమయంలో జగన్ ప్రసంగాలు ఇలా చప్పగా ఉండడం పార్టీ నాయకులకే రుచించడంలేదు.
జగన్ అధికారంలోకి వస్తే ఏం చేస్తారు, చంద్రబాబు నాయుడు ఏం చెయ్యలేకపోయారు.వీటి మీద మాత్రమే ప్రజల దృష్టి ఉండేలా జగన్ తన ప్రసంగాలను చేస్తే బాగుండేది కానీ ఆ విధంగా చేయడంలేదు.
జగన్ పాదయాత్రలో చేసిన ప్రసంగాలు వింటే అధికార పార్టీ మీద చేసే ప్రతి విమర్శ ప్రజల్లో చర్చకు తెర లేపేవి.ప్రత్యర్థుల మీద మాటల దాడి తీవ్రతరం చేయడంతో వారిలో కంగారు పుట్టేది.అయితే ఇప్పుడు ఎంతో కీలకమైన ఎన్నికల సమయంలో ఆ వేడి వేడి ప్రసంగాలను జగన్ పక్కన పెట్టేసి, కేవలం సినిమా డైలాగులను చెప్పడం పార్టీ నాయకులకే మింగుడు పడడంలేదు.ముఖ్యంగా వైసీపీ మ్యానిఫెస్టో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ప్రజల్లో సానుకూలత పెంచుకోవడంలో జగన్ ఇంకా వెనకడుగు వేస్తున్నట్టు గానే కనిపిస్తోంది.
వాస్తవం మాట్లాడుకుంటే జగన్ ప్రసంగాలు ప్రజలకు బోర్ కొట్టిస్తున్నాయే తప్ప అందులో మునుపటి వాడి వేడి అయితే కనిపించడంలేదు.