ఎన్నికల సమయంలో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఇలా గోడ దూకుళ్లు సర్వసాధారణంగా ఉంటాయి.ఒక పార్టీలో ఉన్న నాయకులకు మరో పార్టీ నుంచి మంచి ఆఫర్ రాగానే ముందు వెనుక ఆలోచించకుండా పార్టీ మారిపోతుంటారు.
ఆ ఆవిధంగానే ప్రస్తుతం వైసీపీలోకి కాస్త వలసలు పెరిగాయి.వైసీపీ నుంచి టీడీపీ కి నాయకులు వలసలు వస్తున్నా పెద్ద ఇబ్బంది అయితే లేదు కానీ, వైసీపీ కి ఇదో పెద్ద సమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది.
ఎందుకంటే మొదటి నుంచి పార్టీని నమ్ముకుని, సర్వస్వము ధారపోసిన తమను కాదని కొత్తవారికి పెద్ద పీట వేయడం ఎంతవరకు కరెక్ట్ అని పాత నాయకులు ప్రశ్నిస్తున్నారు.వలస వచ్చిన నాయకులకు ప్రాధాన్యం కల్పించే క్రమంలో తనను నమ్ముకున్న వారిని జగన్ దూరం చేసుకుంటారా అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.
రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి ఎవరు వస్తారు అనేది స్పష్టంగా తెలియకపోయినప్పటికీ తమ సర్వేలు, అంచనాల ఆధారంగా పార్టీలు మారుతున్నారు.గతంలో పార్టీల మార్పుపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగినా ఎన్నికల సమయం కావడంతో ఇదంతా రొటీన్ అన్నట్టు పార్టీలు, ప్రజలు ఇప్పుడు భావిస్తున్నారు.గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పుడు వైసీపీలోకి వచ్చి చేరుతున్నారు.వైసీపీలోకి టీడీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీల నుంచి నాయకులు వచ్చి చేరుతుండడంతో ఆ పార్టీ మరింత బలపడినట్టు కనిపించినా లోపల మాత్రం నాయకుల మధ్య గ్రూపు తగాదాలు పెరిగిపోతున్నాయి.
దీని కారణంగా పార్టీ విజయావకాశాలు ఎక్కడ దెబ్బతింటాయి అనే ఆందోళన కూడా ఇప్పుడు వైసీపీలో ఎక్కువయ్యింది.
ఈ విధంగానే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లో నియోజకవర్గ ఇంచార్జ్ గుణ్ణం నాగబాబు ని కాదని కొత్తగా టీడీపీ మాజీ ఎమ్యెల్యే, బీజేపీ నాయకుడు డాక్టర్ బాబ్జీని పార్టీలోకి తీసుకురావడం ఆయనకు టికెట్ కేటాయించబోతుండడంతో పార్టీలో అసమ్మతి చెలరేగింది.
ఆయనకు టికెట్ ఇస్తే తాము రాజీనామా చేస్తామంటూ నాగబాబు వర్గం అధిష్టానానికి హెచ్చరికలు చేసింది.ఇక ప్రకాశం జిల్లా చీరాలలో టీడీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరడంతో అక్కడ పార్టీని నమ్ముకుని ఉన్న ఎడం బాలాజీ టీడీపీలో చేరిపోయారు.
మార్కాపురంలో కేపీ కొండారెడ్డి కుటుంబం రాకతో అసంతృప్తిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు.ఇదే జిల్లాలో దగ్గుబాటి కుటుంబం వైసీపీలోకి రావడంతో అక్కడ పార్టీని నమ్ముకుని ఉన్న నేతలు ఆందోళలనలో ఉన్నారు.
కర్నూలు జిల్లాలో కాటసాని రాం భూపాల్ రెడ్డి రాకతో పాణ్యంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి టీడీపీలోకి వెళ్లిపోయారు.కృష్ణాజిల్లాలో మల్లాది విష్ణు రాకతో సెంట్రల్ సీటు తనకు రాదని తెలిసి వంగవీటి రాధా టీడీపీకి ఫిరాయించి మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీకి సిద్ధమవుతున్నారు.శ్రీకాకుళం జిల్లాలో కిల్లి కృపారాణి వైసీపీలోకి రావడంతో అక్కడ తమ ప్రాభవానికి ఎక్కడ గండిపడుతుందో అని ధర్మాన కుటుంబం ఆందోళన చెందుతోంది.ఈ విధంగా ఎక్కడికక్కడ అసంతృప్తులు పెరిగిపోవడంతో వైసీపీ లో కొత్త టెన్షన్ మొదలయ్యింది.