పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవ్వడంతో కేంద్రంలో ఈ సారి ఎన్నికల్లో ఏ పార్టీ విజయకేతనం ఎగురవేసి అధికారం దక్కించుకుంటుందో అన్న సందేహం అందరిలోనూ కనిపిస్తోంది.గత ఎన్నికల ముందే దేశవ్యాప్తంగా మోదీ హవా స్పష్టంగా కనిపించింది.
మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించడం తో ఆయన ప్రధాని అయితే దేశం కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందుతుందని అంతా నమ్మారు ఓట్లేశారు.కేంద్రం లో బీజేపీ అధికారం లోకి వచ్చింది.
మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సంస్కరణలు తీసుకువచ్చి అనేక విమర్శలపాలయ్యాడు.ముఖ్యంగా నోట్ల రద్దు, జీఎస్టీ తదితర అంశాలు ఆయన ఇమేజ్ ను డామేజ్ చేశాయి.
అయినా ఆయన మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు.అయితే ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరోసారి మోదీ పాలనకు ప్రజలు పట్టం కడుతారా లేక మార్పు కోరుకుంటారా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ స్పష్టంగా కనిపిస్తోంది.
మోదీ వేవ్ తో బీజెపీ గత ఎన్నికలలో ఘన విజయం సాధించింది కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది.ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించి ఎన్నికల్లో గెలవడం అన్నది ఆషామాషీ కాదు.గత ఎన్నికల్లో మోదీ సెంటిమెంట్ తో యూపీలోని వారణాసి నుంచి ఘనమైన మెజారిటీతో గెలిచారు.అంతే కాదు ఆయన హవాతో యూపీలో 80 ఎంపీ సీట్లలో ఏకంగా 71 గెలిచింది.
కేంద్రంలో అధికారం దక్కాలంటే ముందు యూపీని గెలవాలి కాబట్టి బీజేపీ అలా ప్లాన్ చేసింది.మరి ఈసారి ఎన్నికల్లో పరిస్థితి ఏంటి ? మోడీ ఈసారి మరో టెంపుల్ టౌన్ నుంచి బరిలోకి దిగుతారని అది పూరీ కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.మోదీ వారణాసి నుంచే బరిలోకి దిగుతారని బీజేపీ కీలక నాయకులు కొందరు వాదిస్తున్నారు.పూరీ నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం పొరుగున ఉన్న బెంగాల్, ఒడిషా, ఏపీలపై కూడా పడుతుందని బీజేపీ అభ్యర్ధుల గెలుపు అవకాశాలు మెరుగుపడతాయనీ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.
యూపీ ఉప ఎన్నికలు, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ చేతిలో పరాభవం పాలైన నేపధ్యంలో అక్కడికన్నా ఒడిషా, బెంగాల్, లాంటి రాష్ట్రాల్లో విజయావకాశాలు బాగుంటాయని కమల నాథులు అంచనా వేస్తున్నారు.అంతే కాదు దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ ఏమాత్రం తగ్గలేదని ఇటీవల నిర్వహించిన అనేక సర్వేల రిపోర్ట్స్ ఈ విషయాన్ని ధ్రువీకరించాయని బీజేపీ నాయకులు వాదిస్తున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ పాలనే బాగుంటుందని ప్రజలంతా ఒక అంచనాకు వచ్చినట్టు బీజేపీ లెక్కలతో సహా చెప్తోంది.