ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేకపోవడంతో ఏపీ లోని రాజకీయ పార్టీలు ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చేందుకు సిద్ధమైపోతున్నారు.ఈ నేపథ్యంలోనే ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీలను వేడి పెంచే పనిలో పడ్డాయి.
మొన్నటి వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హోదా ఉద్యమాన్ని భుజానికెత్తుకుని దీక్షలు ధర్నాలు చేపట్టగా… ప్రస్తుతం టిడిపి కూడా అదే అంశంతో ప్రజల్లోకి వెళ్ళింది.తాజాగా నిన్న ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీక్షకు దిగారు.
ఈ దీక్షకు అనేక పార్టీల నుంచి మద్దతు కూడా లభించింది.అయితే ఈ విషయంలో వెనకపడ్డ కాంగ్రెస్ .ప్రత్యేక హోదా భరోసా ప్రజా యాత్ర పేరుతో ఈనెల 19 నుంచి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరా రెడ్డి చెప్పారు.
ఈ యాత్ర అనంతపురం జిల్లా మడకశిర నుంచి ప్రారంభమవుతుందని …మార్చి మూడో తేదీన శ్రీకాకుళంలో ముగుస్తుందని చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్ ,రైల్వేజోన్,కడప ఉక్కు కర్మాగారం, విభజన హామీలు మొదలైనవన్నీ కాంగ్రెస్ తోనే సాధ్యం అవుతాయని ప్రజలకు వివరిస్తూ యాత్రను ముందుకు సాధిస్తామని ఆయన చెప్పారు.ఈ సందర్భంగా మొత్తం 64 బహిరంగ సభలు నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు రోజుకొకరు చొప్పున పాల్గొంటారని ఆయన తెలిపారు.