మద్య తరగతి వారు విమానం ఎక్కడమే గగనం అయిన ఈ రోజుల్లో, విదేశీ ప్రయాణం అంటే ఇక ఆస్తులు అమ్ముకోవాల్సిందే.మద్య తరగతి వారు విదేశీ యాత్రలు అంటూ పుస్తకాల్లో చదువుకోవడం, టీవీల్లో, సినిమాల్లో చూడటం తప్ప మరేం చేయలేరు.
అయితే పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే అనుకున్నాడు కేరళకు చెందిన విజయన్.ఈయన చిన్న కాఫీ షాప్ నడుపుతూ ఏకంగా 23 దేశాలు తిరిగి వచ్చాడు.
అది కూడా ఒంటరిగా కాదు, తన భార్యతో కలిసి.తన భార్యతో సంతోషంగా ఇన్ని దేశాలను తిరిగి వచ్చిన విజయన్కు అంత డబ్బు ఎక్కడిదా అని ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటూ ఉంటారు.
విజయ్ విదేశీ పర్యటనల గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే… యుక్త వయసులో ఉన్న సమయంలో విజయన్కు విదేశాలకు వెళ్లాలని కోరిక కలిగింది.అక్కడ ఏదైనా పని కోసం కాకుండా, జాలీగా కొన్ని రోజులు తిరిగి రావాలనుకున్నాడు.తన భార్యతో అప్పటి వరకు దాచుకున్న డబ్బును ఖర్చు చేసి మొదటి విదేశీ యాత్ర చేసి వచ్చాడు.విదేశీయాత్ర విపరీతంగా ఆ జంట ఎంజాయ్ చేశారు.అప్పటి వరకు ఉన్న డబ్బు అయి పోవడంతో పరిస్థితి ఏంటా అనుకున్నారు.వారు మళ్లీ బాగా కష్టపడి తక్కువ రోజుల్లోనే మళ్లీ డబ్బు సంపాదించారు.
డబ్బు సరిపడ రాగానే వెంటనే మరో విదేశీ ప్రయానం.ఇలా 23 దేశాల్లో ఈ జంట తిరిగారు.
కేరళ రాష్ట్రం కొచ్చిలోని గిరి నగర్లో చిన్న టీ స్టాల్ ఓనర్ అయిన విజయన్కు ప్రస్తుతం 70 ఏళ్లు.ఆయన భార్యకు 65 ఏళ్లకు కాస్త అటు ఇటుగా ఉంటుంది.
తన భార్య సంతోషంతో పాటు, అందరికంటే విభిన్నంగా ఉండాలనే ఉద్దేశ్యంతో తాము ఇలా విదేశీ పర్యటనలు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.రెండు మూడు సంవత్సరాలకు ఒకసారైనా ఏదో ఒక విదేశీ పర్యటనకు వెళ్తున్నాం.
పర్యటనకు ముందు టీ స్టాల్ను బ్యాంకులో తనకా పెట్టి విదేశీ ప్రయాణం చేస్తాం.ఆ తర్వాత వచ్చి కష్టపడి పని చేసి ఆ బ్యాంకు రుణం తీర్చుతాం.
మళ్లీ బ్యాంకులో రుణం తీసుకుని విదేశీ పర్యటన వెళ్తాం అంటూ కాఫీవాలా విజయ్ అంటున్నాడు.
విజయన్ విదేశీ పర్యటన గురించి తెలిసిన స్థానికులు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా అవాక్కవుతున్నారు.ఈ విదేశీ ప్రయాణాలపై మోజుతో ఇప్పటి వరకు విజయన్ తన కాఫీ షాప్ తప్ప మరేం సంపాదించుకోలేదు.విదేశీ ప్రయాణాలు చేయకున్నా కూడా తానేం సంపాదించేవాడిని కాదేమో అంటాడు.
ఈ జంట గురించి తెలుసుకున్న మహీంద్ర కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్ర కేరళ వెళ్లిన సమయంలో స్వయంగా ఆ కాఫీవాలా షాప్కు వెళ్లి కాఫీ తాగుతానంటూ ట్వీట్ చేశాడు.ప్రపంచంలోనే ఈ జంట చాలా సంతోషమైన జంట అలాగే అత్యంత ధనిక జంటగా ఆనంద్ మహీంద్ర అన్నారు.