ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొత్త కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సరికొత్త ఆలోచనలతో ఎవరికీ అందని రీతిలో కొత్త ఎత్తులు వేస్తున్నాడు.
అందుకే… గత ఎన్నికల్లో అమలు చేసిన వ్యూహాలను మళ్లీ తిరిగి ఇక్కడ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.గత ఎన్నికల ముందు ఏపీలో వైసిపి బలం గా ఉన్నట్టు కనిపించింది.అయితే ఆ పార్టీకి దాదాపు అధికారం దక్కడం ఖాయం అని అంతా అనుకున్నారు.కానీ పోలింగ్ తేదీ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.దీనికి బిజెపి జనసేన టిడిపికి అండగా ఉండడం ఒక కారణం అయితే …జగన్ చేసిన సొంత తప్పిదాలు కూడా మరో కారణంగా అయ్యాయి.
గత ఎన్నికలకు ముందు వైసీపీ లోకి వచ్చి చేరాలనుకున్న వారంతా కొన్ని కొన్ని డిమాండ్లు పెట్టారట.
అయితే ఆ డిమాండ్లు మరీ పెద్దగా ఉండడం జగన్ కు నచ్చలేదట.అందుకే వారు బలమైన నేతలు పార్టీలో చేరతానని రాయబారం పంపినా… జగన్ రమ్మని గాని వద్దని కానీ ఈ నిర్ణయం ప్రకటించకుండా వారిని వెయిటింగ్ లో పెట్టేసాడు.
దీంతో వారు వైసీపీలో ఇక లాభం లేదని ముందు వెనుక చూడకుండా టిడిపిలో జాయిన్ అయ్యారు.అలా టిడిపి విజయానికి వీరంతా పరోక్షంగా కారణమయ్యారు.ఈ విధంగానే… అనంతపురం జిల్లాకు చెందిన జెసి దివాకర్ రెడ్డి, విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు ఉన్నారు.వీరిని చంద్రబాబు పార్టీలో చేర్చుకుని వారు కోరిన కోరికలు చాలా వరకు తీర్చి మరీ ….
టిడిపికి కలిసొచ్చేలా చేసుకున్నారు.అలాగే వైసీపీ లో అసంతృప్తి గురైన వారిని పార్టీ అధిష్టానం పట్టించుకోని వారిని గుర్తించి బాబు తన దారిలోకి తెచ్చుకున్నారు.
ఎన్నికలకు ముందు ఆ తర్వాత కూడా పార్టీలోకి పెద్ద ఎత్తున వైసీపీ నేతలను చంద్రబాబు చేర్చుకున్నాడు.ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన అసంతృప్తి నేత కొణతాల రామకృష్ణ కూడా టిడిపిలో చేర్చుకునేందుకు రాయబారాలు పంపుతున్నారు వాస్తవంగా చెప్పాలంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి కి కొణతాల అత్యంత ఆప్తుడు.
కానీ జగన్ వ్యవహారశైలి నచ్చకపోవడంతోనే… ఆయన వైసీపీకి దూరం అయ్యారు.
మాజీ ఎంపీ సబ్బం హరి ది కూడా దాదాపు ఇదే పరిస్థితి.వీరిద్దరూ సంక్రాంతి పండుగ అనంతరం టీడీపీలో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది.ఇక సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆది శేషగిరి రావు కూడా గుంటూరు టికెట్ విషయంలో జగన్ తో విభేదిస్తున్నారు.
ఆయన కూడా వైసీపీ వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారట.ఈ విధముగానే ప్రతీ నియోజకవర్గంలోనూ… వైసీపీలోని అసంతృప్తి నేతలను గుర్తించి పార్టీలో చేర్చుకునేలా బాబు ఇప్పటికే పార్టీ ముఖ్యనాయకులకు ఆదేశాలు జారీ చేసాడు.