ఏపీ , తెలంగాణ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్న తెలుగుదేశం పార్టీ చూపు ఇప్పుడు పక్క రాష్ట్రమైన ఒడిశా మీద కూడా పడినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ , పార్లమెంట్ స్థానాలకు టీడీపీ తరపున అభ్యర్థులను రంగంలోకి దించుతున్నట్టు తెలుస్తోంది.2019 ఎన్నికల సందర్భంగా టీడీపీ ఒడిశాలో 52 అసెంబ్లీ స్థానాలతో పాటు ఐదు పార్లమెంట్ సీట్లకు పోటీ చేస్తుందని ఒడిశా టీడీపీ చీఫ్ రాజేశ్ పుత్ర తెలిపారు.
ఈ ప్రాంతాల్లో తెలుగు జనాభా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని… అందుకే అక్కడ పోటీ చేస్తే ఫలితం ఉంటుంది అనే ఆలోచనలో టీడీపీ ఉందట.ఈ విషయమై కోరాపుట్ లో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో రాజేశ్ పుత్ర మాట్లాడారు.కోరాపుట్, రాయగడ, మల్కన్ గిరి, గజపతి, గంజాం, నబరంగ్ పూర్ జిల్లాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని రాజేశ్ తెలిపారు.
మొత్తం ఐదు లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తామని, వీటిలో కోరాపుట్, నబరంగ్ పూర్, బెహ్రమ్ పూర్, అస్కా లోక్ సభ స్థానాలను ఇప్పటికే ఎంపిక చేయడం జరిగిందని, పోటీ చేసే మరో స్థానాన్ని ఎంపిక చేయాల్సి ఉందని వెల్లడించారు.ఏపీలో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని ప్రచారాస్త్రంగా మలుచుకుని ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళతామని రాజేష్ చెబుతున్నారు.