తెలంగాణాలో ఎన్నికల తంతు ఒక కొలిక్కి వచ్చినా పోలింగ్ సమయానికి ఇంకా కొద్దీ గంటలు మాత్రమే సమయం ఉంది.ఇప్పటివరకు చేసిన ప్రచారం ఒక ఎత్తు అయితే… పోలింగ్ ఏజెంట్ల నియామకం కూడా చాలా కీలకం కాబోతోంది.
అందుకే ఇప్పుడు అభ్యర్థులంతా పోలింగ్ ఏజెంట్ల నియామకంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు.ప్రత్యర్ధి పార్టీలు నియమించే వారిని సమర్ధవంతంగా ఎదుర్కొనే నమ్మకస్తుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే ఏజెంట్లకు రాజకీయ పార్టీలు గాలం వేస్తున్నాయి.తమ గెలుపుకి కీలకమైన ఏజెంట్ల నియామకం కోసం ముఖ్య అనుచరులతో మంతనాలు సాగిస్తున్నారు.
పోలింగ్ బూత్ లో ఓటర్లు ఓటు వేసే సమయంలో ఎన్నికల అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరును పరిశీలించేంది పోలింగ్ ఏజేంట్లే కావడంతో అభ్యర్ధులు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అనుకూ ఎటువంటి ప్రలోభాలకు లొంగని అత్యంత నమ్మకస్తులనే ఏజెంట్లుగా నియమించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రత్యర్ధులు పోలింగ్ ను తమకు అనుగుణంగా మార్చుకోకుండా అన్ని పార్టీలు పోలింగ్ కేంద్రాల్లో ఏ విధంగా వ్యవహరించాలో ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.మరో వైపు ఏజెంట్లుగా ఎవరు ఉండబోతున్నారో ఆరా తీసి వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.
పోలింగ్ తేదీ కీలక సమయంలో అవసరమైతే ఎక్కువ మొత్తంలో డబ్బు ఇచ్చి ఏజెంట్ గా నియమించుకునేందుకు అభ్యర్ధులు కసరత్తు చేస్తున్నారు.ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల బలహీనతను అవకాశంగా తీసుకుని ఆయా పార్టీల కార్యకర్తలు ఏజెంట్లుగా కొనసాగేందుకు పోటీ పడుతూ… తమ గొంతెమ్మ కోర్కెలను బయటపెడుతున్నారు.పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల వ్యవస్థ ఎంతో మందికి తెలియనప్పటికీ తెరవెనుక వీరి పాత్ర కీలకంగా ఉంటుంది అందుకే ఇప్పుడు వీరిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు.మమ్మల్ని ముంచినా … తేల్చినా వారే అన్నట్టుగా భారం మొత్తం వారిపైనే వేశారు.