ఎన్నికల సందడి మొదలు అయితే చాలు చిన్నా చితకా ముసలి ముతక అందరికీ డిమాండ్ పెరిగి పోతుంది.నాయకులు తమకు జన బలం ఉందని చూపించుకోవడానికి అవసరం ఉన్నా లేకపోయినా జనాలను వెంటేసుకుని తిరగాల్సిందే.
అయితే ఇప్పుడు తిరిగే వారంతా ఆ నాయకుడు మీద అభిమానంతోనో … ఆ పార్టీ మీద ప్రేమతో తిరిగే వారో కాదు.వారు అలా వెంట తిరిగినందుకు ఒక స్పెషల్ రేటు ఉంటుంది.
అంతేనా అంటే…ఇంకా బిర్యాని , మందు ఉండాల్సిందే.ఇవన్నీ ఇస్తేనే… ఆ నాయకుడి వెంట నడిచేది.లేకపోతే… ఈ నాయకుడి ప్రత్యర్థి వైపు తిరగడానికి కూడా వెనకాడడం లేదు.అలా ఉంది మరి వీరి డిమాండ్.
దీంతో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కూడా తిరిగే వారిని సంతృప్తిపరచడానికి వారు వారి గొంతెమ్మ కోరికలు అన్ని తీరుస్తున్నారు.
ఆ తరువాత జేబుకు పడ్డ చిల్లును చూసుకుని లబోదిబోమంటున్నారు.అయినా తప్పదు మరి .ఎందుకంటే ఎన్నికల్లో గెలవాలంటే ఆమాత్రం ఖర్చు పెట్టాల్సిందే.ఇప్పుడు ఎన్నికలంటేనే కాస్ట్లీ.బిర్యాని కి మందు కి వెనకాడితే ఆ తర్వాత రాజకీయ మనుగడ కోల్పోవడమే.
ముఖ్యంగా నాయకుల వెంట తిరిగేవారికి ఉదయం టిఫిన్ దగ్గర నుంచి సాయంత్రం మందు వరకు అన్ని అభ్యర్థులే చూసుకోవలసి వస్తోంది.ఒకవైపు ఓటర్లను ప్రసన్నం చూసుకుంటూనే…తమ కూడా తిరిగే వారి కోరికలను తీరుస్తూ అభ్యర్థులు నలిగిపోతున్నారు.అయితే వీరికి సాధారణ భోజనం పెడితే సరిపోతుందా అంటే… అబ్బబ్బే… అలా సాధారణ భోజనం పెడితే మేమెందుకు వస్తాం…? అంటూ వారు తెగేసి చెప్పేస్తున్నారు.
ఒకవైపు జనాల కొరతతో ఇబ్బంది పడుతున్నందున చేసేదిలేక వారు కోరినట్టే బిర్యానీలు వందిస్తున్నారు.అది సరిపోక పోతే భారీ ఎత్తున హోటల్ నుంచి పార్సిల్ తెప్పించి వారికి నైవేద్యం పెట్టుకుంటున్నారు.మరి కొంతమంది అయితే నాకు సాధారణ బిర్యాని పనికిరాదని… స్పెషల్ బిర్యానీ కావాలంటూ… తమ గొంతెమ్మ కోర్కెలను అభ్యర్థులు ముందు ఉంచుతున్నారు.
దీంతో ఇప్పుడు తెలంగాణలోని హోటల్స్ అన్నీ కిటకిట లాడుతున్నాయి.ఎన్నికల పుణ్యమాని రెస్టారెంట్లు వారు కూడా నాలుగురాళ్లు వెనకేసుకుంటున్నారు.ఇక మందు సంగతి అయితే చెప్పక్కర్లేదు.ముక్క … చుక్క లేనిదే ఒక్క అడుగు కూడా ముందుకు వేసే పరిస్థితి వెంట తిరిగేవారు లో కనిపించడం లేదు.
.