అమ్మ.ఎక్కడైనా అమ్మే.బిడ్డ ఆకలితో అలమటిస్తే ఆమెకు గుండె తరుక్కుపోతుంది.తన బిడ్డేకాదు, చుట్టుపక్కల ఏ బిడ్డయినా సరే ఆకలితో రోదిస్తే తట్టుకోలేదు.బెంగళూరులో కానిస్టేబుల్ అర్చన ఓ అనాథ శిశువుకు పాలుపట్టిన విషయం పలువరిని కదిలించిన సంగతి తెలిసిందే.అలాంటి అరుదైన సంఘటన మరొకటి జరిగింది.
24 ఏళ్ల ప్రతీషా ఆర్గానోకు ఇప్పుడందరూ చేతులెత్తి నమస్కరిస్తున్నారు.ఫిలిప్పిన్ ఎయిర్ లైన్స్లో ఎయిర్ హోస్టస్గా పనిచేస్తున్న ఆమె ఆకలితో అల్లాడిపోతున్న పరాయిబిడ్డకు పాలిచ్చి మాతృత్వపు గొప్పతనాన్ని చాటింది.
ఈ నెల 6న విమానంలో ఆమె విధులు నిర్వహిస్తున్న విమానంలోనే ఈ సంఘటన జరిగింది.
ప్లేన్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ ప్రయాణికురాలి బిడ్డ గుక్కపట్టి ఏడ్చింది.తల్లి దగ్గర పాలు లేవు.డబ్బా పాలూలేవు.ఏం చేయాలని ఎవరికీ అర్థం కాలేదు.9 నెలల బిడ్డకు తల్లయిన ప్రీతీషా.వెంటనే అక్కడికి చేరుకుంది.ఆకలితో ఏడుస్తున్న ఆ చిన్నారిని తీసుకుని చనుబాలు తాపింది.దీంతో బిడ్డ నెమ్మదించి నిద్రపోయింది.ప్రీతీషా తర్వాత తిరిగి తన విధుల్లోకి వెళ్లిపోయింది.
పాలుపడుతున్నప్పుడు ప్రయాణికులు తీసిన ఫోటో,ఆమె రాసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అమ్మ ఎక్కడైనా అమ్మేనని, ఆమె ప్రేమకు హద్దుల్లేవని ప్రీతీషాను జనం మెచ్చుకుంటున్నారు.ఈ ఫోటోకు లక్షన్నరకుపైగా లైకులు, 34 వేల షేర్లు, వేలకొద్దీ కామెంట్లు వస్తున్నాయి.