తెలంగాణాలో టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి ఏర్పడిన మహాకూటమిలో తరుచు ఏదో ఇబ్బంది తలెత్తుతూనే ఉంది.సీట్ల సర్దుబాటు వ్యవహారమే అసలు సిసలు సమస్యగా మాహాకూటమికి ఇబ్బంది ఎదురయ్యింది.అయితే… అవన్నీఅధిగమించి ఏదోలా బయటపడినా… మరో కొత్త సమస్య కూటమిలో ఉన్న పార్టీలను వేధిస్తోంది.అదేంటంటే .రాజకీయంగా ఒక పార్టీ మీద మరో పార్టీ కత్తులు నూరుకున్నారు.అయితే… ఇప్పుడు అవన్నీ పక్కనపెట్టి పొత్తుపెట్టుకోవడం … సీట్ల సర్దుబాటు చేసుకోవడం మొదలయినవన్నీ జరిగిపోయాయి.అయితే ఈ పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు ఏ మేరకు జరుగుతుంది అనేది పెద్ద చిక్కుముడిగా కనిపిస్తోంది.
గత ఎన్నికల ఓట్ల లెక్కలు ఇప్పటికే ఎలా మారాయో తెలియదు.అందులో ఎంత మేరకు కూటమి అభ్యర్థులు పొందగలుగుతారనేదే ఇప్పుడు అతి పెద్ద సవాల్ గా మారింది. తెలంగాణ వాదం బలంగా ఉన్న సమయంలోనూ కాంగ్రెస్, తెలుగుదేశం మెరుగైన సంఖ్యలో సీట్లు సాధించగలిగాయి.
ఆ తరువాత రెండు పార్టీల నుంచి కూడా కొందరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు.ఆ రెండు పార్టీలు ఎమ్మెల్యేలను మాత్రమే కోల్పోయాయా లేకపోతే ప్రజాదరణను కూడా ఆ మేరకు నష్టపోయాయా అనే విషయం ఈ ఎన్నికల్లో తేలబోతోంది.
అభ్యర్థి ఎవరనే దానితో సంబంధం లేకుండా ప్రతి పార్టీకి కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది.ఈ ఓటు బ్యాంక్ ఈ ఎన్నికల్లో గణనీయ ప్రభావాన్ని చూపిస్తుంది.దీంట్లో కుల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది.
ఆయా సామాజిక వర్గాల మద్దతు ఇప్పుడు మిత్రపక్షాలకు ఒకదానికొకటి ఏ మేరకు తోడ్పడుతాయన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలతో అధికార పక్షం ఆయా సామాజిక వర్గాలకు చేరువ అయ్యే ప్రయత్నం చేసింది.ఆ ప్రయత్నం ఎంతవరకు విజయం సాధించిందనే అంశం ఇప్పుడు టీఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చనుంది.
మరో వైపున సంప్రదాయక ఓటు బ్యాంకులపై మిత్రపక్షాలకు ఏ మేరకు పట్టు ఉందనే విషయం పై క్లారిటీ రావాల్సిందే.తెలంగాణలో కూటమి ఏర్పాటులో కీలకపాత్ర వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు తహతహలాడుతున్నాడు.
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా అదే వ్యూహంతో వ్యవహరిస్తోంది.ప్రధాని అభ్యర్థి పదవిని త్యాగం చేసేందుకు కూడా ఆ పార్టీ సిద్ధపడింది.మొత్తం మీద తెలంగాణలో జరిగిన మహాకూటమి ప్రయోగం జాతీయ స్థాయిలో ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది.దీంతో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయంలో అందరిలోనూ ఉత్కంఠ కనిపిస్తోంది.