నేటి తరుణంలో మన దేశంలో అవినీతి ఎలా పెరిగిపోయిందో అందరికీ తెలిసిందే.అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా, ఏ ప్రభుత్వ శాఖలో అయినా అవినీతి రాజ్యమేలుతోంది.
ఈ క్రమంలో నీతిగా, నిజాయితీగా సేవలు అందించే అధికారులే కరువవుతున్నారు.నూటికో, కోటికో ఒక్కరు అలాంటి వారు కనిపిస్తున్నారు.
ఇప్పుడు చెప్పబోయే ఆ మహిళా పోలీసాఫీసర్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతారు.ఆమె నీతి, నిజాయితీలకు మారుపేరు.
విధి నిర్వహణలో ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది.కాబట్టే పోలీసాఫీసర్గా ఇప్పటి వరకు సుమారుగా 1000 మంది తప్పిపోయిన చిన్నారులను తిరిగి తమ తమ తల్లిదండ్రులతో కలిపింది.
దీనికి గాను ఆమె అందరి నుంచీ ప్రశంసలు అందుకుంది.
ఆమె పేరు రేఖా మిశ్రా.2014లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)లో చేరింది.ముంబైలోని చత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ) రైల్వే స్టేషన్లో విధులు నిర్వహించేది.
అదే ఏడాది ఈమె ఆ స్టేషన్లో తప్పిపోయిన ముగ్గురు బాలికలను తమ స్వస్థలమైన చెన్నై చేర్చింది.వారి తల్లిదండ్రులకు ఆ బాలికలను అప్పగించింది.ఇక ఆ తరువాత కూడా ఇదే తరహాలో తప్పిపోయిన పిల్లలను, అక్రమ రవాణాకు గురైన పిల్లలను రక్షించి అక్కున చేర్చుకునేది.అనంతరం వారి సంరక్షణ చూస్తూ వారి తల్లిదండ్రులను ట్రేస్ చేసి వారి పిల్లలను వారికి అప్పగించడం ప్రారంభించింది.
అలా అనేక మంది పిల్లను రేఖా మిశ్రా కాపాడింది.
రేఖా మిశ్రా నీతి, నిజాయితీలతో వ్యవహరించడం, తన పని తాను చేయడంతోనే పిల్లలు ఇప్పుడు సంతోషంగా తమ తల్లిదండ్రులు వద్దకు చేరుతున్నారు.ఈ క్రమంలో ఆమె 2017లో ఏకంగా 953 మంది పిల్లలను కాపాడి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చింది.వారిలో 92 మంది 8 నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న బాలికలు ఉన్నారు.
దీంతో రేఖా మిశ్రా రక్షించిన పిల్లల సంఖ్య 1000కి చేరింది.ఈ క్రమంలో ఆమె తాజాగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కార్ అవార్డును అందుకుంది.
దేశ వ్యాప్తంగా ఆయా రంగాల్లో సేవలు అందించిన 100 మంది మహిళలకు ఏటా ఆ రోజున ఈ అవార్డును ప్రదానం చేస్తారు.అందులో భాగంగా ఆమెకు అవార్డుతోపాటు రూ.1 లక్ష నగదు పురస్కారం కూడా లభించింది.ఏది ఏమైనా తప్పిపోయిన పిల్లలను తమ తల్లిదండ్రుల వద్దకు చేర్చడం అంటే మాటలు కాదు.
అందుకు రేఖా మిశ్రాను అందరం అభినందించాల్సిందే కదా.!
.