ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో ఎన్నో వర్గాలకు చెందిన ప్రజలు నివాసం ఉంటున్నారు.వారంతా తమ విశ్వాసాలు, ఆచార, వ్యవహారాలకు అనుగుణంగా జీవనం సాగిస్తున్నారు.
అయితే వ్యక్తులే కాదు ప్రపంచంలోని దేశాలు, వాటిలో ఉండే పలు ప్రాంతాలకు కూడా పలు నియమాలు, నిబంధనలు ఉంటాయి.ఆయా ప్రదేశాల్లో నివసించాలంటే అక్కడి నియమాలకు, నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవల్సిందే.
అలాంటి నిబంధనల్లో డ్రైవింగ్ కూడా ఒకటి.
మీరెప్పుడైనా గమనించారా.? కొన్ని దేశాల్లో రోడ్డుపై కుడివైపుకు వాహనాలను నడుపుతారు.అదే మన దేశం అయితే రోడ్డుకు ఎడమ వైపు వాహనాలను నడుపుతారు.
అసలీ తేడా అంతా ఎందుకు? అన్ని ప్రాంతాల్లో డ్రైవింగ్ ఒకే రకంగా ఎందుకు ఉండదు? మీకు తెలుసా.? అదే ఎందుకో ఇప్పుడు చూద్దాం.
అది ఇప్పుడు కాదు.1700వ సంవత్సరం నాటి మాట.అప్పుడు ప్రస్తుతం ఉన్న వాహనాలేవీ లేవు.కేవలం గుర్రాలను మాత్రమే రవాణాకు ఉపయోగించేవారు.వాటిపై ఎక్కి ప్రయాణించేవారు.అయితే అలా గుర్రాలపై ప్రయాణించడానికి ముందుగా వాటిపైకి జనాలు ఎడమ వైపు నుంచే ఎక్కేవారు.
ఎందుకంటే చాలా మంది కుడి చేతి వాటం కలవారు కావడం చేత.దీంతోపాటు అప్పట్లో కత్తులు ఎక్కువగా వాడే వారు కాబట్టి వాటిని వ్యక్తులు తమ ఎడమ వైపు ఒరలో ఉంచుకునే వారు.
ఈ క్రమంలో గుర్రానికి కుడి వైపు నుంచి ఎక్కితే కత్తితో సమస్యలు వస్తాయి కాబట్టి దానికి ఎడమ వైపు నుంచే ఎక్కేవారు.అలా ఎక్కిన తరువాత కూడా రహదారిపై ఎడమ వైపు నుంచే ప్రయాణించడం మొదలు పెట్టారు.
అది అప్పటి వారికి సౌకర్యంగా ఉండేది.
అనంతరం 1756, 1773 కాలం నాటికి గుర్రపు బండ్లు రంగ ప్రవేశం చేశాయి.
అయితే అప్పుడు కూడా రోడ్డుపై ఎడమ వైపునే ప్రయాణించేవారు.కాగా అంతకు ముందు అంటే 1300వ సంవత్సరంలో అప్పటి పోప్ బోనిఫేస్ VIII ప్రజలను రహదారిపై ఎడమ వైపునే ప్రయాణించమని చెప్పారట.
అలా కూడా గ్రీకులు, రోమన్లు, ఈజిప్షియన్లు రహదారిపై ఎడమ వైపునే ప్రయాణిస్తూ వచ్చారు.కాగా 1756లో లండన్ బ్రిడ్జిపై రహదారికి ఎడమ వైపునే వెళ్లాలని అప్పటి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
దీంతో ఆ పద్ధతి సౌకర్యవంతంగా ఉందని చెప్పి అక్కడ కూడా రహదారిపై ఎడమ వైపునే ప్రయాణించడం మొదలు పెట్టారు.
అయితే అమెరికా వంటి కొన్ని దేశాల్లో మాత్రం రహదారిపై కుడి వైపు ప్రయాణానికి ప్రజలు బాగా అలవాటు పడ్డారట.దీంతో 1915లో హెన్రీ ఫోర్డ్ తమ కార్లకు డ్రైవర్ సీట్ను ఎడమ వైపు ఉంచాడట.ఈ క్రమంలో అలాంటి కార్లు రహదారిపై కుడి వైపు ప్రయాణానికి అనుకూలంగా ఉండేవి.
రాను రాను అమెరికన్ల పద్ధతి బాగుందని చెప్పి అన్ని దేశాలు అదే తరహా డ్రైవింగ్ సిస్టమ్ను అనుసరిస్తూ వస్తున్నాయి.
అయితే ఇండియాలో మాత్రం అందుకు భిన్నంగా ఇప్పటికీ రహదారిపై ఎడమ వైపునే వెళ్తున్నారు.
ఎందుకంటే బ్రిటిషర్లది అదే పద్ధతి కాబట్టి, వారు మన దేశాన్ని పాలించారు కాబట్టి ఇక్కడ కూడా వారి పద్ధతే అమలులోకి వచ్చింది.అనంతరం దాన్ని మళ్లీ మార్చలేదు.
సో, లెఫ్ట్, రైట్ డ్రైవింగ్ సిస్టమ్ గురించిన అసలు విషయం అదండీ!
.