తెలంగాణాలో పోలింగ్ తేదీ దగ్గరకు వస్తున్నా … టీఆర్ఎస్ పార్టీలో సర్వేల హడావుడి తగ్గలేదు.అసలు సర్వేలను నమ్ముకునే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు తెరలేపాడు.
పార్టీ పనితీరు , ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా.? అసలు పార్టీ పరిస్థితి ఏంటి.? తన పాలనలో ఇంకా ఏమైనా పొరపాట్లు జరుగుతున్నాయా .? ఇలా అనేక అనేక కోణాల్లో కేసీఆర్ ఇప్పటికే అర డజనుకు పైగా సర్వేలు చేయించాడు.ఆ సర్వేలను నమ్ముకునే అంత ధీమాగా మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్నాడు.అయితే… కేసీఆర్ ప్రకటించిన పార్టీ అభ్యర్థులపై కేటీఆర్ కి ఏదో తేడా కొడుతుందట.అందుకే మళ్ళీ ఆయన సొంతంగా సర్వే చేస్తున్నాడట.
ముఖ్యంగా ఇప్పటికే పార్టీ టికెట్ దక్కించుకున్న అభ్యర్థుల్లో … ప్రజాగ్రహం చవిచూస్తున్నవారి మీద ఫోకస్ పెట్టాడట.అలాంటి అభ్యర్థులపై ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఆయా నియోజక వర్గాల్లో సర్వేలు నిర్వహించినట్టు ఆ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది.ఇప్పటికే వీరిపై ప్రభుత్వ వర్గాల ద్వారా తెప్పించుకున్న నివేదికలు, కేసీఆర్ చేయించుకున్న సర్వే ఫలితాలను పక్కన పెట్టి.
కేటీఆర్ కొత్తగా ఓ బృందాన్ని రంగంలోకి దించారట! గ్రామాల వారీగా, పోలింగ్ బూత్ ల వారీగా, కులాల వారీగా, కుల సంఘాల ప్రాతిపదిక.వ్యతిరేకత వ్యక్తమౌతున్న అభ్యర్థిపై ఈ స్థాయిలో అభిప్రాయ సేకరణ చేస్తున్నారట.
ఇప్పటికే ఇలా రెండు దఫాలుగా ఈ తరహాలో సర్వేలు నిర్వహించారనీ, ప్రస్తుతం మూడు దఫా సర్వే జరుగుతోందని టీఆర్ఎస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కేటీఆర్ చేయిస్తున్న సర్వేలో మంచి మార్కులు పడని అభ్యర్థుల జాబితా ప్రత్యేకంగా తయారు చేస్తున్నట్టు సమాచారం.అంటే, ప్రస్తుతం కేటీఆర్ చేయిస్తున్న సర్వేల్లో సరైన ఫలితాలు సాధించిన వారికి మాత్రమే నామినేషన్ వేసేందుకు పార్టీ నుంచి బీ ఫామ్స్ అందుతాయనీ, లేనివారికి అనుమానమే అనే ప్రచారం ఇప్పుడు టీఆర్ఎస్ లో ఊపందుకుంది.ఈ మూడో సర్వేలో కొద్ది వ్యతిరేకత వ్యక్తమై.
స్థానికంగా లోటుపాట్లు సరిదిద్దుకునే అవకాశం ఉంటే, అలాంటి చర్యలపై కూడా కేటీఆర్ దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది.దీంతో టికెట్ దక్కించున్న అభ్యర్థుల్లో కొత్త టెన్షన్ పట్టుకుంది.
ఇప్పటికే డబ్బు మంచినీళ్లలా ఖర్చుపెట్టేస్తున్నాం ఒకవేళ బీ ఫార్మ్ లభించకపోతే పరిస్థితి ఏంటి అని గుబులు చెందుతున్నారు.