ఎన్నికల వార్లో భాగంగా టీఆర్ఎస్ను అవినీతి కోణంలో టార్గెట్ చేయడమే కాకుండా, స్టార్ క్యాంపెయినర్లతో ఓటర్లను ఆకర్షించేందుఉ కాంగ్రెస్ శరవేగంగా ముందుకు కదులుతోంది.ఈ నేపథ్యంలో ఇటు విజయశాంతి అటు చిరంజీవిల చేత క్యాంపెయినింగ్ చేయించాలని ఎప్పట్నుంచో పీసీసీ నాయకత్వం భావిస్తుందట.
ఈ కోణంలో ఒక సమస్య పరిష్కారమైంది అనుకుంటున్నా సమయంలో మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది.
నిన్న, మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉన్నాలేనట్టే ఉంటూ… తన స్థాయికి తగ్గ గుర్తింపు, పదవి ఇవ్వడం లేదని అలిగిన విజయశాంతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.చివరకు రాహుల్ గాంధీ హైదరాబాద్కు వచ్చిన వేళ కూడా అజ్ఞాతం వీడలేదు.చివరకు పార్టీ హైకమాండ్ ఈ ఎన్నికల్లో విజయశాంతిని స్టార్ క్యాంపెయినర్గా ప్రకటించడంతో ఆమె అలకవీడారు.
ఎన్నికల ప్రచారంలో ఆమె శరవేగంగా ముందుకు కదులుతున్నారు.ఆమె ప్రచారంతో పార్టీలో ఒకరకమైన ఊపు కనిపిస్తోంది.
ఇక మెగాస్టార్ చిరంజీవిని కూడా సీన్లోకి తీసుకొచ్చి ఇద్దరి చేత ఒక రేంజ్లో క్యాంపెయినింగ్ చేయించాలని భావిస్తున్న పీసీసీ పెద్దలకు తాజా పరిణామాలు షాక్ ఇస్తున్నాయట.చిరంజీవి ప్రచారానికి రావడం సంగతి తరువాత అసలు కాంగ్రెస్లోనే ఉంటారా.? అన్న ప్రశ్నకు తెర తీశాయి తాజా పరిణామాలు.మెగాస్టార్, లేడీ అమితాబ్లతో ప్రచారం చేయించాలన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకు నిరాశ తప్పేలా లేదు.
కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ కు చెందిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేనకు జై కొట్టిన విషయం తెలిసిందే.విజయవాడలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.తనకు, పవన్ కళ్యాణ్కు పెద్దన్నయ్య అయిన చిరంజీవి ఆశీస్సులు ఉన్నాయంటూ మనోహర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్లో కలవరం రేపుతున్నాయట.కొంతకాలంగా కాంగ్రెస్ కార్యక్రమాలన్నిటికీ చిరంజీవి దూరంగా ఉంటున్నారు.
అయినా కూడా ఆయన మా పార్టీలోనే ఉన్నారు, అవసరమైన వేళ ఆయన తన సేవలు అందిస్తారు అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పుకుంటూ వస్తున్నారు.ఇప్పుడు చిరంజీవి ఆశీస్సులు మనకే ఉన్నాయని ఓపెన్గానే మనోహర్ చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
చిరంజీవి కూడా అదును చూసి కాంగ్రెస్ కు గుడ్ బాయ్ చెప్పి జనసేనలో చేరేందుకు సిద్ధం అయినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.