మహాకూటమి కాస్తా … ప్రజకూటమిగా మారిపోయింది.అయితే… ఆ కూటమిలో ఉన్న పార్టీల మధ్య మాత్రం ఇంకా సఖ్యత రావడంలేదు.సీట్ల తెంపు ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడంలేదు.ఈ సమయంలోనే కొన్ని పార్టీలు బెదిరింపులకు దిగుతున్నాయి.మేము అడిగినన్ని సీట్లు ఇస్తారా లేక మా దారి మేము చేసుకోమంటారా .అంటూ హడావుడి చేస్తున్నాయి.ఈ సీట్ల పంపకాలపై ఒక క్లారిటీ రాకపోవడంతో ఎన్నికల ప్రచారంలో కి వేగంగా వెళ్లలేకపోతున్నారు.ఈ విషయంలో కూటమి ఉమ్మడి ప్రత్యర్థి అయిన టీఆర్ఎస్ మాత్రం ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా ప్రచారంలో దూసుకుపోతోంది.
సీట్ల సర్దుబాటు విషయంపై కూటమి నేతల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.శనివారం కూడా కూటమి నేతలు రహస్యంగా సమావేశమైనట్టు సమాచారం.హైదరాబాద్ లోని గండిపేటలో జరిగిన ఈ సమావేశంలో టి.టీడీపీ నేత ఎల్.రమణ, టీజేఎస్ అధినేత కోదండరామ్, సీపీఐ నేత చాడా వెంకట రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఒక ప్రముఖ నేత హాజరైనట్టు తెలుస్తోంది.అయితే, సమావేశంలో సీట్ల సర్దుబాటు విషయమై కొంత స్పష్టత వచ్చిందని తెలుస్తోంది.
టీడీపీ 15 సీట్ల కోసం పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.కానీ, కాంగ్రెస్ మాత్రం 9 ఇచ్చేందుకే సిద్ధమన్నట్టు సమాచారం.సీపీఐ ఆరు కోరుతుంటే, వారికీ మూడే అంటోందట.టీజేయస్ దాదాపు 16 సీట్లు ఆశిస్తుంటే.అందులో సగం మాత్రమే కోదండరామ్ పార్టీకి ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.అయితే, ఈ నంబర్లపై మూడు పార్టీల నేతలూ సంతృప్తిగా లేరని అంటున్నారు.
దీంతో చర్చల ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని నేతలు అంటున్నారు.సీట్ల కుస్తీలో కూటమి పార్టీల వ్యూహం ఒకలా కనిపిస్తుంటే, కాంగ్రెస్ పట్టు మరోలా కనిపిస్తోంది! కనీసం వంద స్థానాల్లో సొంతంగా పోటీ చేయాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఉంది.
అందుకే, భాగస్వామ్య పక్షాలకు 20 సీట్లు మాత్రమే ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్టుంది.పైగా భాగస్వామ్య పక్షాలకు అత్యధిక స్థానాలు కేటాయిస్తే… ఆ తరువాత వారిపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుందనే లెక్కల్లో కాంగ్రెస్ ఉంది.