టీఆర్ఎస్ లో గత కొంత కాలంగా ఓ అంతర్గత వివాదం జరుగుతోంది.పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్న హరీష్ రావు ను క్రమక్రమంగా దూరం పెడుతున్నారని, ఆయన అనుచరులనుకున్న వారికి సరైన ప్రాధాన్యం ఇవ్వకుండా కక్ష సాధిస్తున్నారని … ఇలా అనేక రకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి.
దీంతోపాటు హరీష్ వర్గంగా పేరు పొందిన వారంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరిపోతుండడం కేసీఆర్ ను ఆలోచనలో పడేసింది.ఎన్నికల సమయంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం పార్టీకి తీరని లోటని భావించిన కేసీఆర్ కొత్త ఎత్తుగడ వేసాడు.
కేటీఆర్ ప్రాధాన్యత పెంచడానికే హరీష్ హవా తగ్గిస్తున్నారనే అపవాదు నుంచి తప్పించుకోవడానికా అన్నట్టు తాజాగా హరీశ్ రావు, కేటీఆర్ ఇద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు, నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు.ఒకర్నొకరు బ్రహ్మాండంగా పొగుడుకున్నారు.అభివృద్ధిలో తప్ప ఇంకెందులోనూ తమకి పోటీ లేదని తేల్చి చెప్పారు. అయితే ఇదంతా కేవలం ఎన్నికల కోసం చేసిన స్టంట్ లాగే కనిపిస్తోంది.
ఉద్యమ సమయంలో తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడూ హరీశ్, కేటీఆర్ ఇలా ఒకే వేదికను ఇంత సరదాగా పంచుకోలేదు.కనీసం జాయింట్ గా ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు.
కేబినెట్ భేటీ తర్వాత కూడా ఎవరి దారి వారిదే తప్ప కలసి ఫొటోలకు ఫోజులిచ్చిన సందర్భం లేదు.
సిరిసిల్ల నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి, సిద్దిపేట హరీశ్ రావుకీ సంబంధం ఏంటి? ఎక్కడో ఏదో జరిగింది.తెలంగాణ ప్రభుత్వంలో మంత్రుల శాఖల కేటాయింపుల్లోనే హరీశ్ కి బాగా అన్యాయం జరిగిందనే ప్రచారం మొదటి నుంచీ ఉంది.ఉద్దేశపూర్వకంగానే హరీశ్ ని పక్కనపెట్టి కేటీఆర్ కి ఎక్కువ ప్రాముఖ్యం కల్పించారు కేసీఆర్.
అయినా హరీష్ ఎక్కడా … తన అసంతృప్తి బయటపడకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తూ వస్తున్నారు.ఈ అంశాన్ని ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూడడంతో కేసీఆర్ ముందు జాగ్రత్తపడినట్టు తెలుస్తోంది.
అయితే బావ బామ్మర్దులు పైకి నవ్వులు చిందించినా లోలోపల మాత్రం ఎవరి కడుపు మంట వారికే ఉంది.అదే కదా రాజకీయం అంటే.