దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది.ఈ హత్యలతో కొంతమంది రాజకీయ నాయకులకు కూడా ప్రమేయం ఉన్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో పార్టీలు కూడా వారిపై వేటు వేసేందుకు కూడా వెనకాడడంలేదు.
ఎందుకంటే వారిని ఇంకా వెనకేసుకొచ్చి పార్టీలోనే కొనసాగిస్తే.ప్రజాగ్రహం కాస్త పార్టీలపై పడుతుందని వారిని వదిలించేందుకు సిద్ధం అవుతున్నాయి.
ఈ కోవలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి ప్రమేయం ఉందని తెలియగానే కాంగ్రెస్ అతడిని పార్టీ నుంచి బహిష్కరించింది.ఇక ఇందులో ఉమ్మడి నల్లగొండ జిల్లా నకిరేకల్ టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పేరు వినిపిస్తోంది.
ఈ హత్యకు వేముల వీరేశం కు సంబంధం ఉందని ప్రణయ్ భార్య అమృత అనుమానం వ్యక్తం చేస్తోంది.గతంలో ఆయన కూడా తమను బెదిరించాడని ఆమె చెప్పడంతో టీఆర్ఎస్ లో కలకలం రేగింది.అసలే ముందస్తు ఎన్నికల్లో దూసుకుపోవాలని చూస్తున్న ఆ పార్టీకి ఈ మకిరి అంటుకోవడంతో నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని పార్టీ ఆలోచిస్తోంది.ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకున్న వేముల వీరేశంకు ఈసారి టికెట్ వస్తుందో రాదోనన్న ఊహాగానాల మధ్య చివరకు కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.105 మంది అభ్యర్థుల లిస్ట్ లో ఆయన పేరు కూడా చేర్చారు.
గతంలోనూ ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి.నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ భర్త హత్యలోనూ ఆయన పాత్ర ఉన్నదనే ఆరోపణలు వచ్చాయి.కాంగ్రెస్ నేతలు కూడా వేముల వీరేశంపైనే తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజాగా.ప్రణయ్ హత్యలో కూడా ఆయన పాత్ర ఉన్నదంటూ అనుమానాలు రావడంతో ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనని పార్టీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
అయితే ఈ విషయంలో చూసి చూడనట్టు వదిలేస్తే ఆ ప్రభావం పార్టీ మొత్తం మీద పడుతుందని, అంతే కాకుండా మృతుడు సామాజికవర్గం వారు కూడా పార్టీకి దూరం అవుతారనే కోణంలో కేసీఆర్ ఆలోచిస్తునాడు.ఇన్ని తలనొప్పులు భరించేకంటే అతడికి టికెట్ కట్ చేస్తే రెండు విధాలుగా కూడా కలిసి వస్తుందనే భావనలో కేసీఆర్ ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.