ఎన్నికల సమయంలో పార్టీల కీలక నాయకులు అంతర్గతంగా అనేక విషయాల గురించి చర్చిస్తుంటారు.ప్రత్యర్థి పార్టీలను ఎలా దెబ్బకొట్టాలి.
ఆ పార్టీ నాయకుల వీక్ నెస్ ఏంటి.? తదితర అంశాలను చర్చించి దానికి అనుగుణంగా తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు.అయితే.అత్యంత కీలకమైన వ్యూహాల గురించి ప్రత్యర్థులకు తెలిసిపోతే .? ఇంకేమన్నా ఉందా .? రాజకీయంగా పెద్ద దెబ్బ పడిపోతుంది.అందుకే పార్టీలు ఎన్నికల సమయంలో అందరి నాయకులపై ఒక కన్నేసి ఉంచుతాయి.ప్రతి ఒక్కరిని అనుమానంగా చూస్తూ తమ ఎత్తులు బయటకి వెళ్లకుండా జాగ్రత్తపడుతుంటారు.
ఇప్పుడు ఆ కోవర్ట్ ల భయం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పట్టుకుంది.కాంగ్రెస్ లోని కీలక నిర్ణయాలు, కొన్ని కొన్ని సీక్రెట్స్ ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రహస్యంగా చేరవేస్తున్నారని.టీఆర్ఎస్ కు వారు బాగా సహకరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వారు ఎవరో కాంగ్రెస్ నేతలకు తెలిసినా ఆధారాలు లేకపోవడంతో బహిరంగంగా ప్రకటించలేని దుస్థితి నెలకొంది.
ఒకవేళ ప్రకటిస్తే పార్టీలో జరిగే రచ్చ అంతా ఇంతా కాదు.అందుకే సైలెంట్ గా జరిగేది చూస్తున్నారు.
అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు ఈ విషయం పై స్పందించారు.కాంగ్రెస్ లో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారికి హెచ్చరికలు జారీ చేశాడు.తమ పార్టీలోని కొందరు కోవర్టులు టీఆర్ఎస్ కు సహకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కానీ ఎన్నికలకు ముందు పార్టీలో అలజడులు ఉండొద్దనే ఉద్దేశంలోనే వారందరినీ ఎన్నికల సమయంలో కలుపుకుపోతామని వీహెచ్ వారికి విజ్ఞప్తి చేశారు.అయితే ఇప్పటికే పార్టీకి ద్రోహం చేస్తూ… టీఆర్ఎస్ కు సహకరిస్తున్న వారి జాబితా కాంగ్రెస్ సిద్ధం చేసుకుంది.