ఏపీలో ఒక వెలుగు వెలిగి ఇప్పుడు పూర్తిగా రాజకీయ ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునర్వైభవం కోసం ఆరాటపడుతోంది.గత ఎన్నికల ముందు ఏపీ విభజన చేసి ప్రజల ఆగ్రహంతో పూర్తిగా పార్టీ తుడుచుపెట్టుకుపోయింది.మళ్ళీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని మళ్ళీ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది.అందుకే… ఏపీ కాంగ్రెస్ ఇంచార్జీ ఉమెన్ చాందీ స్వయంగా రంగంలోకి దిగి నేతలు, క్యాడర్ను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు.కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.
పైకి బలోపేతం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నా … క్షేత్ర స్థాయిలో అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణుల పనితీరు ఆశించిన స్థాయిలో కనిపించడంలేదు.ముఖ్యంగా నాయకుల్లో ఆర్థికపరమైన ఇబ్బందులు వెంటాడుతున్నాయి.సొంతంగా ఖర్చులు పెట్టుకోవడం తమవల్ల కాదని చేతులెత్తేస్తున్నారు.
ఇటీవలే మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి, బైరెడ్డి రాజశేఖర్రెడ్డి లాంటి వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఇలాగే భారీగా వలసలుంటాయని చెబుతున్నా ఇప్పటికిప్పుడు పార్టీలోకి వచ్చే వారు పెద్దగా కనిపించడంలేదు.
చేరికల మాట అటుంచితే ఉన్న కొద్దిమంది నేతలు జారిపోయేలా కనిపిస్తున్నారు.మాజీ మంత్రి కొండ్రు మురళి కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరైన తర్వాత టీడీపీ నేతలతో టచ్ లో ఉంటూ వస్తున్నారు.దీంతో ఆయన దాదాపు సైకిల్ ఎక్కడం ఖాయం అని తెలుస్తోంది.అలాగే మరో నేత ఉగ్ర నరసింహా రెడ్డి కూడా సీఎం చంద్రబాబు ను కలవడంతో ఆయన కూడా టీడీపీ తీర్థం పుచ్చుకునే వారి జాబితాలోకి చేరిపోయారు.
మాజీ మంత్రి శైలజానాథ్ పరిస్థితి కూడా అటా ఇటా అన్నట్లుగా ఉంది.టీడీపీతో సన్నిహితంగా ఉంటే తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తే అందుకు విరుద్ధంగా తమ నేతలకే టీడీపీ గేలం వేస్తే ఎలా అని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.