అన్ని పార్టీల నాయకుల్లోనూ ఎన్నికల మూడ్ కనిపిస్తుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో మాత్రం ఆ సందడి కనిపించడం లేదు.ఒక వైపు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ పాదయాత్ర చేస్తూ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావాలని కలలు కంటుంటే ఆ పార్టీ లో మాత్రం ఎదో తెలియని అసమ్మతి కనిపిస్తోంది.
వైసీపీకి తిరుగులేదని, తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకత పార్టీకి అనుకూలించబోతుందని వైసీపీ వర్గాలన్నీ ఇంతకుముందు తెగ సంబరపడ్డాయి కానీ ఎన్నికల సమయం దగ్గరకు వచ్చే కొద్దీ ఆ జోష్ కనిపించడమే లేదు.దీనికి అధినేత జగన్ వైకిరే కారణం అని తెలుస్తోంది.
జగన్ పాదయాత్రతో పార్టీకి కొత్త శక్తీ వస్తుందని ఎన్నికల్లో విజయం ఖాయమని లెక్కలు వేసుకున్న పార్టీ నాయకులకు ఇప్పుడు ఆ పార్టీలో జరుగుతున్న కొన్ని సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.చాలా నియోజకవర్గాల్లో పాదయాత్రకు ముందున్న ఉత్సాహం కాస్తా తగ్గినట్టే కనిపిస్తోంది.తెలుగుదేశంను నేరుగా ఢీ కొట్టే దిశగా కేడర్ను సమాయత్తపర్చాల్సింది పోయి, చివరి క్షణం దాకా టికెట్ ఎవరికి ఇస్తారో తెలియనే తెలియదు.అటువంటప్పుడు ముందుగానే మేము తొందరపడి పార్టీ కోసం డబ్బులు ఖర్చుపెట్టేస్తే ఆ తరువాత మా పరిస్థితి ఏంటి అనే సందిగ్ధంలో కొంతమంది టికెట్ ఆశించే అభ్యర్థులు ఉన్నారు.
పార్టీ కోసం తాము ఎంత కష్టపడినా చివరి నిమిషంలో ఎవరో ఒకరికి టికెట్ కట్టబెట్టేస్తే అప్పుడు మా పరిస్థితి ఏంటి అన్న కోణంలో కొంతమంది నాయకులు ఉన్నారు.దీనికి ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు కూడా వారు ఉదాహరిస్తున్నారు.
అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు సామాజిక పరిస్థితుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవడం, ఎదుటి పక్షం వ్యూహాన్ని బట్టే, తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉన్నందున పార్టీలో ఇప్పటికీ కొంత సందిగ్ధత కొనసాగడానికి కారణంగా చెబుతున్నారు.
ప్రస్తుతం వైసీపీలో ఎవరికి టికెట్ వస్తుంది, ఎవరెవరికి చేజారబోతుందో ఊహించలేకుండా ఉంది.ఇంతకుముందు ఎన్నికల్లో అభ్యర్థులకు ఒక స్పష్టత వచ్చిందని, దానిని బట్టే పార్టీ వ్యవహారాల్లో ఒకటికి రెండుసార్లు చురుగ్గా వ్యవహరించారని, ఆర్థికపరమైన ఇబ్బందులను అధిగమించి నేరుగా ఎన్నికల సమరంలోకి దూకిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఇలా అయితే పార్టీకి తీరని నష్టం జరగడం ఖాయం అని వారు చెప్తున్నారు.