తెలంగాణాలో కారు పార్టీ స్పీడ్ మామూలు రేంజ్ లో లేదు… తమ స్పీడ్ ఇంకా ఎవరూ అందుకోకూడదని గులాబీ బాస్ తాపత్రయం .అందుకే అన్ని పనులను ఇంకాస్త ముందుగానే మొదలు పెట్టేస్తూ ప్రత్యర్థి పార్టీల్లో కంగారు పుట్టించేస్తున్నాడు.
తెలంగాణాలో ఎన్నికల వాతావరణం కాస్త ముందుగా తీసుకొచ్చేశారు కేసీఆర్.దీంతో ప్రత్యర్థి పార్టీలు కూడా ఆ వేగం అందుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.
టీఆర్ఎస్ కి ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ కూడా రాజకీయ జోరు పెంచే పనిలో ఉంది ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ కూడా అప్పుడే తెలంగాణాలో ఓ ట్రిప్ వేసి వెళ్ళిపోయాడు.ఇక కేసీఆర్ అయితే వచ్చే నెలలో పార్టీ అభ్యర్థులను ప్రకటించేస్తానని బహిరంగంగా చెప్పేసాడు.
ఇప్పుడు చర్చ కూడా ఈ అంశం మీదే హాట్ హాట్ గా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
రాబోయే ఎన్నికల్లో తమకు సమస్యగా మారిన అంశాలను తీర్మానాల ద్వారా కేంద్రం మీదకు నెట్టేశారు.శుక్రవారం జరగబోయే ఎమ్మెల్యేలు, ఎంపీ సమావేశాల్లో రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను వారికి వివరించబోతున్నారు.అంతేకాదు నియోజకవర్గాల్లో ప్రజలకు దగ్గర కావడానికి ఇంకా ఏంఏం చేయాలో వారికి వివరిస్తారట.
ఇటీవల జరిగిన సర్వే ఫలితాలను వారి ముందు ఉంచబోతున్నారు.ఈ సమావేశాలు జరిగిన తర్వాత సెప్టెంబర్ 2న హైదరాబాద్ శివారులో భారీ బహిరంగసభ నిర్వహించబోతున్నారు.
ప్రగతి నివేదన పేరుతో జరిగే సభలో నాలుగేళ్లలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల ముందు పెట్టి తమ ఘనత చాటుకుంటారట.
ఇప్పటివరకూ ఒక ఎత్తు అయితే అసలు పరీక్ష కేసీఆర్కు సెప్టెంబర్లోనే ఎదురు కాబోతుంది.ప్రగతి నివేదన సభ ముగిసిన తర్వాత వారం పదిరోజులకు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను ప్రకటిస్తామని కేసీఆర్ చెప్పారు.అయితే ఒక్కసారి అభ్యర్థలను ప్రకటిస్తే టీఆర్ఎస్లో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాలతో పాటు చాలా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ టికెట్ను ముగ్గురు నుంచి నలుగురు ఆశిస్తున్నారు.ఒక్కసారి అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వీరంతా ఏం చేస్తారు? కొందరికి అయితే పదవుల ఆశ చూపుతారు.కానీ మిగతా వారంతా టికెట్ రాలేదని గొడవకు దిగే అవకాశం ఉంది.దీనిని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారనేది ఓ చాలెంజ్.
అంతేకాదు కొంతమంది ఇతర పార్టీలకు జంప్ అయ్యే అవకాశం ఉంది.మరికొందరు రెబెల్గా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఈ సమస్యలు కేసీఆర్ కు ఓ విధంగా చాలెంజ్.