ఏపీలో ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ బిజీ బిజీగా ఉన్నాయి.ఒక వైపు ఎన్నికల కసరత్తు మరోవైపు పార్టీ నాయకుల పని తీరు తెలుసుకునేందుకు చేపడుతున్న సర్వేలు.
ఇలా ప్రతి పార్టీ బిజీ బిజీగా ఉన్నాయి.ఇప్పటివరకు అనేక సర్వేలు నిర్వహించిన ప్రధాన పార్టీలు ఈ సారి చేయబోయే సర్వేల రిజల్ట్ ని బట్టి ఎన్నిక టికెట్లు కేటాయించే అవకాశం ఉన్నట్టు తేలడంతో సిట్టింగ్ ఎమ్యెల్యేలతో పాటు టికెట్లు ఆశించే నేతలందరిలోనూ ఒకటే టెన్షన్ పట్టుకుంది.
సర్వేల ద్వారా పార్టీలు ప్రజల నుంచి తెలుసుకోవాలనుకుంటున్న విషయాలు ఏంటి అంటే.వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరయితే బాగుంటుంది?.అక్కడి జనాలు ఎవరిని కోరుకుంటున్నారు?.నియోజకవర్గంలో వారి బలా బలాలెంత?.ఫలానా అభ్యర్థికి గెలిచే అవకాశాలు ఏమేరకు ఉన్నాయి? అనే దానిమీద ముమ్మరంగా సర్వేలను నిర్వహిస్తున్నాయి పార్టీలు.ఈ సర్వే ఫలితాల ఆధారంగా నాయకుల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది తేలిపోనుంది.
అయితే గతంలో నిర్వహించిన సర్వేల్లో తమకు 10 పాయింట్లు.9 పాయింట్లు వచ్చాయని మురిసిపోతున్న నాయకుల్లో కూడా తాజా సర్వే భయపెడుతోందట.చంద్రబాబు ఇంటెలిజెన్సీ సర్వేతో పాటు ఓ యూనివర్సిటీలో చదివిన యువకులు, ఓ ప్రైవేటు సంస్థ ద్వారా వేర్వేరుగా సర్వే చేయించి నాయకుల పని తీరు, ప్రజల్లో వారికున్న బలాబలాలపై నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.మూడు నివేదికలను క్రోడీకరించి టికెట్ ఆశిస్తున్న వారి బలాబలాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని టీడీపీ లో టాక్.
ఇక ప్రతిపక్ష పార్టీ వైసీపీ కూడా తన సర్వే బృందాలను రంగంలోకి దింపింది.ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెరచాటుగా ఈ సర్వే వ్యవహారాల్లో మునిగి తేలుతున్నాడట.
తాజాగా అధినాయకుడు జగన్ చేతిలో ప్రస్తుత పార్టీ పరిస్థితిపై ఓ రిపోర్ట్ తాయారు చేసి పెట్టాడట.ప్రత్యేక హోదా, విభజన హామీల అమల్లో కేంద్రం అన్యాయం చేసిందన్న అభిప్రాయం మెజారిటీ రాష్ట్ర ప్రజల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో బిజెపి తాజా పరిస్థితులపై సమగ్ర సర్వే చేయించినట్లు తెలిసింది.
ఇక జనసేన విషయానికి వస్తే ఆ పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు సర్వే రిపోర్టులు తెప్పించుకునో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.