రాజకీయ పార్టీలు ఎన్ని ఎత్తులు, పై ఎత్తులు వేసినా అంతిమంగా వారికి కావాల్సింది అధికారం.అందుకోసం ఎటువంటి పనులు చేసేందుకైనా వెనుకాడరు.
ఇక రాజకీయ వైరాలు ఎక్కువగా ఉండే తెలంగాణ రాజీకీయాల్లో ఎన్నికల సమయం ముంచుకొస్తున్న తరుణంలో పార్టీలన్నీ పొత్తుల లెక్కల్లో ములిగిపోయాయి.ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కుతుందో ముందుగానే అంచనా వేసుకుని హీటెక్కించే ప్రకటనలు చేస్తున్నాయి.
ఇక అధికార పార్టీ టీఆర్ఎస్ అయితే ఎన్నికల్లో ఒంటరిగానే రంగంలోకి వెళ్లేందుకు సిద్ధం అయ్యింది.
సాధారణ ఎన్నికలకు సమయం ఉన్నా.పార్టీలు, రాజకీయ నేతల మధ్య వార్ నడుస్తూనే ఉంది.వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదేనంటూ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.2019 అసెంబ్లీ ఎన్నికలపై టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్లు దృష్టి సారించాయి.గెలుపే లక్ష్యంగా వలసలను ప్రొత్సహిస్తూ కీలకమైన నేతలను పార్టీలోకి చేర్చుకుంటోంది టీ కాంగ్రెస్.
బోడుప్పల్లో జరిగిన కాంగ్రెస్ సభలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉండడంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి.
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ను కేసీఆర్ ఒంటి చేత్తో గెలిపిస్తారని సింహం సింగిల్ వస్తుందని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ పొత్తులపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు.కాంగ్రెస్, తెలుగుదేశంతో పాటు మరో రెండు మూడు పార్టీలు ఏకమైనా ఒక్కొక్కరికి డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు ఓటేస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణలో ఎన్నికల్లో పొత్తులపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.పొత్తులు లేక పోయినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.