ఒకప్పుడు వానాకాలం చదువులు అనేవారు.వర్షం వస్తే ఇల్లే స్కూల్.
ఇల్లే ఆటస్థలం.ఆ రోజుల్లో పిల్లలని స్కూల్స్కి తీసుకు వెళ్లడానికి మాస్టార్లు ఇంటికి వచ్చేవారు.
గుమ్మంలో నిలబడి పిల్లల్ని పిలిచి వాళ్లకి తాయిలాలు పెట్టి, పిల్లల్ని చంకనేసుకుని తీసుకెళ్లేవారు.కన్నతండ్రి కంటే ఎక్కువ బాధ్యత తీసుకుని వాళ్లని ఉత్తమ పౌరులుగా తీర్చేవారు.
విద్యార్థులు కూడా గురువుల పట్ల గౌరవంగా ఉండేవారు.కానీ ఇప్పుడు అలా కాదు.
విద్యాసంస్థలు అన్ని వ్యాపార పరిశ్రమలగా మారిపోయాయి.
ప్రస్తుత రోజుల్లో పిల్లలను స్కూల్ లో తల్లితండ్రులు దించుతారు లేదా వారే వెళ్లారు.
దీనివల్ల పిల్లలు గురువుల మధ్య అనుబంధం కొరవడింది.ఇందుకు భిన్నంగా ఒక సరికొత్త మార్గం ఎంచుకున్నాడు మాంజా మహదేవ అనే టీచరు.
కర్ణాటక ఉడిపి జిల్లా రగిహకలు గ్రామానికి చెందిన మాంజా మహదేవ తను పని చేస్తున్న పాఠశాలలో రోజురోజుకీ విద్యార్థులు తగ్గిపోవడం గమనించాడు.పిల్లలు స్కూల్ కి రావడానికి సరైన రవాణా సౌకర్యం లేదని, అందువల్ల పిల్లలు చదువుకోలేకపోతున్నారని అర్థం చేసుకున్నాడు.
మాంజా మహదేవ మరింత బాధపడ్డారు.ఎలాగయినా వారిని పాఠశాలకు రప్పించాలనుకున్నారు.అందుకోసం తన మారుతి వాన్ను బయటకు తీసి డ్రైవర్ అవతారం ఎత్తారు! ప్రతి ఉదయం విద్యార్థులని తన కారులో స్కూలుకు తీసుకు వచ్చి, సాయంత్రం మళ్లీ వాళ్లను ఇంటి దగ్గర దింపడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడం మొదలైంది.
మాంజా సంతోషానికి అవధులు లేవు.ఇదంతా పరిశీలించిన స్కూల్ డెవలప్మెంట్ మానిటరింగ్ కమిటీ త్వరలోనే ఈ పాఠశాలకు ఒక వ్యాన్ మంజూరుకు ఆలోచిస్తోంది.
ఆచార్య దేవో భవ అంటారు.మహదేవో భవ అనాల్సిందే మనం.