ఏపీ ముఖ్యమంత్రికి ఈ మధ్య ఓ కొత్త అనుమానం బయలుదేరింది.పక్క పార్టీలో గెలిచినా కొంతమంది ఎమ్యెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా పార్టీలోకి ఆహ్వానించి కొంతమందికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు.
అయితే వాళ్లపై ఎందుకో కానీ ఈ మధ్య బాబు కి అనుమానం బయలుదేరింది.అందుకే వారి పై నిఘా పెట్టారు.
పార్టీ ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? నియోజకవర్గంలో ఏం చేస్తున్నారు? వంటి కీలక అంశాలపై ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకుంటున్నారు.రాబోయే ఎన్నికల సమయానికి వారు పార్టీలో ఉంటారా లేక పక్క చూపులు చూస్తున్నారా అనే అంశాలపై వారిపై ఎవరికి అనుమానం కలగకుండా సీక్రెట్ నిఘా పెట్టారు.
రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, విభజన చట్టంలో ఉన్న మేరకు లబ్ధి చేకూరి మరో 50 మంది ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుందని బాబు భావించారు.దానిని నమ్ముకునే పక్క పార్టీల నుంచి ఎమ్యెల్యేలను ఆహ్వానించడమే కాకుండా వారికీ టికెట్ హామీ కూడా ఇచ్చేసారు.కానీ పార్టీలో ఇప్పటికే ఉన్న నాయకులకు, ఫిరాయించి వచ్చిన వారికీ టికెట్లు ఇవ్వాల్సిన సంకట పరిస్థితి బాబు కి వచ్చింది.కొంతమంది టికెట్ తమకు దక్కే అవకాశం లేదని భావిస్తున్నవారు పార్టీ మారేందుకు పక్క చూపులు చూస్తున్నారు.
ప్రస్తుతం సిట్టింగులుగా ఉంటూనే వచ్చే ఎన్నికల నాటికి మరో పార్టీలోకి అయినా జంప్ చేసి టికెట్ సంపాయించాలని చూస్తున్నారు.వీరిలో వైసీపీ ఎమ్మెల్యేలు.
వంతల రాజేశ్వరి, మణిగాంధీ, జయరాములు, మంత్రి అఖిల ప్రియ వంటి కీలక నేతలు కూడా ఉన్నారు.వీరికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కే పరిస్థితి లేదని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో వారు తమ దారి తాము చూసుకునే పనిలో పడ్డారు.అయితే, ఈ విషయం ముందే పసిగట్టిన చంద్రబాబు.
వీరిపై నిఘాను ముమ్మరం చేశారు.వారు నియోజకవర్గంలో చేపడుతున్న కార్యక్రమాలపై నివేదికలు తెప్పించుకున్నారు.
ఈ క్రమంలోనే వీరు `అసమర్ధులు` అనే ముద్రవేసి వారికీ రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని బాబు ఆలోచన.