నగరంలో రోడ్లపై ఒకటే ట్రాఫిక్, ఆ ట్రాఫిక్ మధ్యలో అయ్యా,అమ్మా అంటూ అడుక్కునే బిచ్చగాళ్ళు, చదువుకునే వయసులో రోడ్డెక్కిన పిల్లలు, పనిలేక గుడి మెట్లపై అడుక్కుంటున్న పనిచేయగల వయసున్న వారు.ఇలా ఎంతోమంది బిచ్చగాళ్ళు యాచన చేస్తూ జీవితం గడుపుతున్నారు.
దీనికి కారణం పేదరికం, పనిదొరక్కపోవడం .ఇలా ఎన్నో కారణాలు కావచ్చు.ఇలాంటి వారందరినీ ఒకేచోటికి చేర్చి నెలకు రూ.10,000 సంపాదించుకునేలా పని కల్పించింది స్వాతి బాండియా.
ఒకరోజు ఆటోలో వెళ్తున్న స్వాతి దగ్గరకు ఒకమ్మాయి వచ్చి, అమ్మా ధర్మం చేయండని చేయి చాచింది.ఇలా డబ్బులిచ్చి బిచ్చగాళ్ళను, యాచించేవారిని ఎంకరేజ్ చేయడం ఇష్టంలేని స్వాతి ఇవ్వనని, లేదని చెప్పింది.ఆ అమ్మాయి అలానే అడుగుతూ నిల్చొని ఉంది.ఇక ఇంకో అమ్మాయి ఏవో చిన్న వస్తువలు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పట్టుకొని అమ్ముతోంది.అమ్మా ఈ వస్తువులు తీసుకోండి కేవలం రూ.10 అని చెప్పింది.స్వాతి దగ్గర డబ్బులు ఉన్నా, ఎందుకో కొనడానికి ఇష్టపడలేదు.పైన భగభగ మండుతున్న సూర్యుడు, కాళ్ళకు చెప్పులు లేకుండా నడి రోడ్ పై పరిగెత్తుకుంటూ సిగ్నల్స్ దగ్గర ఆ వస్తువులను అమ్ముకుంటున్నారు.
వాళ్ళను చూసి జాలి కలిగింది స్వాతికి.వారి నేఫధ్యం, వారు ఎలా జీవిస్తున్నారో తెలుసుకోవడానికి వాళ్ళు నివసిస్తున్న చోటుకు వెళ్ళింది.చిన్న చిన్న గుడిసెల్లో కొందరు బ్రతుకుతుంటే, మరికొందరు ఫ్లై ఓవర్ల కింద జీవనం సాగిస్తున్నారు.వీరంతా పనికోసం నగరానికి వచ్చిన వలస కార్మికులు.
అయితే ఇక్కడ పనిలేకపోవడంతో పొట్టకూటి కోసం ఇలా బిచ్చగాళ్ళుగా మారి యాచిస్తూ పొట్ట నింపుకుంటున్నారు.ఈ పని చేయడం ఇష్టంలేకపోయినా, వేరే పనిచేయడానికి ఆసరా లేదు.
ఇదంతా తెలుసుకున్న స్వాతి కళ్ళు చెమర్చాయి.వీరికోసం ఏదైనా చేయాలని ఆలోచించింది.‘ఓం శాంతి’ట్రేడర్స్ అనే సంస్థను తన 18వ ఏట ప్రారంభించింది స్వాతి.ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ‘ సమాజంలోని వివిధ రకాలైన వ్యక్తులు మరియు ఆర్ధిక సామజిక మధ్య ఉన్న దూరం తగ్గించడమే’.
అదే లక్ష్యంతో ముందుకు సాగింది.భిక్షాటన చేస్తున్న వారిని ‘ఓం శాంతి’ ఉద్యోగులుగా చేర్చుకొని, వారి ప్రతిభను గుర్తించడమే కాకుండా చేతివృత్తులలో ప్రత్యేక శిక్షణ ఇప్పించి , అల్లికలతో కూడిన కుర్చీలను,గృహోపకార వస్తువులను చేయించేది.
వీటిని మార్కెట్ లో అమ్మగా వచ్చిన లాభంతో మళ్ళీ పెట్టుబడి పెట్టి, వారికి జీతంతో పాటు జీవితాన్ని కల్పించింది.ఇలా కొద్దిరోజులలోనే సమాజంలో వారు పేదరికంలో బ్రతుకుతున్నాము అనే భావన వారి మనసులో లేకుండా చేసింది.
ప్రస్తుతం వారంతా నెలకు రూ.10,000 సంపాదిస్తున్నారు.ఒకప్పుడు నడి రోడ్ పై, గుడిమెట్ల వద్ద యాచన చేసిన వారు నేడు సంతోషంగా స్కూల్ కు వెళ్తున్నారు, బాగా చదువుకుంటున్నారు.చిన్న వయసులోనే సామాజిక వేత్తగా ఎదిగిన స్వాతిని 2014లో భారత ప్రతినిధిగా, పేదరిక నిర్మూలన విషయమై ఐక్యరాజ్య సమితి పిలుపునందుకొని కొలంబియాలో నిర్వహించిన ‘బాటమ్ ఆఫ్ ది పిరమిడ్ ఛాలెంజ్’ లో పాల్గొని, తన విలువైన సూచనలిచ్చి పేదరిక నిర్మూలనకు తనవంతు కృషి చేస్తోంది.
సమాజంలో ఎటువంటి ఆర్ధిక అసమానతలు లేకుండా అందరూ సమానమే అనేలా సమన్యాయాన్ని పాటిస్తూ, కిందస్థాయి నుండి ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుస్తూ ధనిక, పేద అంతర్యాన్ని తొలగించడమే ఆశయంగా జీవిస్తూ, ఎవరూ గుర్తించలేని విధంగా గొప్పపనులు చేస్తున్న స్వాతిని గౌరవంగా అభినందించాల్సిందే.