కొత్త నంబర్ తీసుకున్నామంటే ఓపిక ఎక్కువే ఉండాలి.
స్టోర్ కి వెళ్ళాలి, మన ఐడి ఫ్రూఫ్, ఫోటో సబ్మిట్ చేయాలి, ఓ సంతకం చేయాలి, ఆ తరువాత ఒకటి రెండు రోజులు ఎదురుచూసి, మనమే కాల్ చేసి, మన ఆధార్ కార్డు వివరాలు తెలిపి మన నంబర్ నుంచి సర్వీసులు యాక్టివేట్ చేసుకోవాలి.
ఇంత పెద్ద ప్రొసీజర్ అంటే ఎవరికైనా విసుగే.కాని ఇకపై మీరు కొత్త సిమ్ సర్వీసులు పొందడానికి రోజులకొద్ది ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు.
ఎందుకంటే టెలికాం కంపెనీలు ఇకపై E-KYC అనే కొత్త టెక్నాలజిని అందుబాటులోకి తెస్తున్నాయి.దీనిద్వారా రెండంటే రెండే నిమిషాల్లో మీ సిమ్ యాక్టవేట్ అయిపోతుంది.
ఇప్పటికే రిలయన్స్, ఎయిర్ టెల్, ఐడియా సంస్థలు ఈ టెక్నాలజీని కొన్ని స్టోర్స్ లో ఉపయోగిస్తున్నాయి.ఇక ఇది ఎలా పనిచేస్తుందంటే, స్టోర్ లో ఉన్న సిబ్బందికి మీ ఆధార్ కార్డు ఇవ్వగానే, వారి దగ్గర ఉన్న కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ లో మీ వివరాలను కన్ఫర్మ్ చేసుకుంటారు.
ఒక్కసారి మీ ఐడెంటిటి నిర్థారణ జరిగాక మరో పరికరంలో వేలిముద్రలు తీసుకుంటారు.అంతే మీ సిమ్ యాక్టివేట్ అయిపోతుంది.
ఈ పద్ధతి ద్వారా టెలికాం కంపెనీలకు అదనపు ఖర్చులు తప్పుతాయి.పనిభారం తగ్గడమే కాకుండా, వచ్చే అయిదేళ్ళలో టెలికాం ఇండస్ట్రీకి దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయి.
అన్నిటికీ మించి కస్టమర్లకు ఎదురుచూపులు ఉండవు.