వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీ జెండా ఎగురవేయాలనే పట్టుదలతో ఉన్న వైసీపీ అధినేత జగన్ దానికి అనుగుణంగానే టీడీపీలో పెద్ద తలకాయలను టార్గెట్ పెట్టుకుని వారి ఓటమే వైసీపీ గెలుపుకు నాంది అనే ఆలోచనలో ఉన్నాడు.ఆ పెద్ద తలకాయలు ఎప్పుడూ… జగన్ మీద విరుచుకుపడుతూ.
సమయం సందర్భం లేకుండా … ఆరోపణలు చేస్తూ జగన్ కు తలనొప్పిగా మారారు.అందుకే ఎప్పటి నుంచో వారి మీద గుర్రుగా ఉన్న జగన్ వచ్చే ఎన్నికల్లో వారి ఓటమి మీద వైసీపీ గెలుపు జెండా ఎగురవేయాలనే టార్గెట్ పెట్టుకున్నాడు.
జగన్ టార్గెట్ పెట్టుకున్న నేతలు ఎవరూ వచ్చే అసెంబ్లీ లో తన కంటికి కనిపించకూడదు అని జగన్ భావిస్తున్నాడు.ఆయన టార్గెట్ లో ఉన్న మంత్రులు ఎవరెవరు అంటే.జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో పాటు ఏపీలో కీలకమైన రాజధాని జిల్లా అయిన గుంటూరు జిల్లాలో ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు ఉన్నారు.జగన్ వచ్చే ఎన్నికల్లో ఏపీ కేబినెట్లో కీలకంగా ఉన్న ఈ మంత్రులను ఓడించడం ద్వారా టీడీపీకి పెద్ద షాకే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే ఆ నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి అన్ని కోణాల్లో బలమైన, సమర్థులైన వారిని ఎంపిక చేసుకుంటున్నాడు.
జగన్ పీకలదాకా కోపం పెంచుకున్న నాయకుల్లో కింజరాపు అచ్చెన్నాయుడు మొదటి స్థానంలో ఉంటాడు.
అసెంబ్లీలోనూ, బయటా జగన్ అంటే ఏ రేంజ్లో విరుచుకుపడతారో, ఎంత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.లాజిక్ లేకుండా జగన్ను పదే పదే టార్గెట్ చెయ్యడంలో అచ్చెన్న ఎప్పుడూ ముందే ఉంటారు.
శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అచ్చెన్నను ఎలాగైన ఓడించాలని చూస్తున్న జగన్ సామాజిక సమీకరణల పరంగా అక్కడ కాళింగ సామాజికవర్గానికి చెందిన వారిని రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక్కడ మంత్రి సామాజికవర్గం కంటే కాళింగలే ఎక్కువ.అక్కడ ఇప్పటికే సీటు కోసం పోటీ పడుతున్న దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్తో పాటు త్వరలో పార్టీలో చేరతారని భావిస్తున్న మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణిలలో ఎవరో ఒకరిని రంగంలోకి దింపాలని చూస్తున్నాడు.
అలాగే మరో మంత్రి దేవినేని ఉమ.ఈయన మీద కూడా జగన్ భారీ స్థాయిలోనే ఫోకస్ పెట్టాడు.ఈ క్రమంలోనే కృష్ణ జిల్లాలోని మైలవరంలో ఉమాను ఓడించేందుకు అదే జిల్లాకు చెందిన బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన వసంత నాగేశ్వరరావు తనయుడు వసంత కృష్ణప్రసాద్ను రంగంలోకి దింపారు.
సామాజికపరంగానూ, ఆర్థిక పరంగానూ ఉమాకు కృష్ణప్రసాద్ సరైన అభ్యర్థి కానున్నారు.
ఇక గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు షాక్ ఇచ్చనేదుకు ఆర్థికంగానూ, సామాజిక సమీకరణల పరంగాను సమర్ధురాలైన ఎన్నారై లేడీ విడదల రజినీని పుల్లారావు మీదకు పోటీకి దింపుతున్నారు.
బలమైన వాయిస్, దూకుడుగా జనాల్లోకి చొచ్చుకుపోయే రజినీ ఎంట్రీతో పుల్లారావుకు ఇప్పటికే ముచ్చెమటలు స్టార్ట్ అయ్యాయి.