తెలంగాణాలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడించడానికి టి.కాంగ్రెస్ నేతలు తహతహలాడుతున్నారు.
ఇప్పటివరకు గ్రూపు రాజకీయాలతో సతమతం అవుతున్న కాంగ్రెస్ ఇదే పంథాలలో ముందుకు వెళ్తే అధికారం దక్కడం కలగానే మిగిలిపోతుందని ఆ పార్టీ నేతలు ఆలస్యంగా అయినా గుర్తించారు.అందుకే ఇప్పుడు నేతలంతా సమన్వయంగా ముందుకు వెళ్లి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సిద్ధం అయ్యారు.
ఈ నేపథ్యంలోనే … నేడు రాహుల్ సమక్షంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకునేందుకు నేడు టి.కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీకి పయనం అవుతున్నారు.
రాహుల్ తో భేటీ సందర్భంగా… తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావును ఓడించడానికి అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించనున్నారు.ఈ సందర్భంగానే.టీఆరఎస్ కు వ్యతిరేకంగా.మహాకూటమి ఏర్పడబోతున్నందున మిత్రపక్షాలకు ఎన్ని స్థానాలు? ఎక్కడెక్కడ కేటాయించాలన్న దానిపై కూడా ఈ రోజు అగ్రనేతలతో చర్చల సందర్భంగా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.దీంతో పాటు 40 అభ్యర్థుల తొలి జాబితాను కూడా ఈరోజు విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
రాహుల్తో భేటీకి తెలంగాణ నుంచి ముఖ్యమైన నాయకులు సుమారు ఏభై మంది వరకు వెళ్లినట్టు తెలుస్తోంది.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి సోదరులు, డీకే అరుణతో పాటు మరికొందరు ముఖ్యనేతలు రాహుల్ తో చర్చలు జరపనున్నారు.ఈ సందర్భంగా కొందరు పొత్తులతో కొందరు నేతలకు అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని రాహుల్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.పార్టీలో సమన్వయం లేదని, దీనికారణంగా పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు కూడా నేతలు హాజరు కావడం లేదని రాహుల్ కు చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు.
సరిగ్గా ఇదే సమయంలో అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో కి వలస వచ్చేందుకు ఎంఎల్సీ భూపతిరెడ్డి సిద్ధం అవుతున్నారు.ఏమైనా రాహుల్ తో టి.కాంగ్రెస్ నేతల భేటీ కొత్త ఉత్సాహం తీసుకువచ్చేలా కనిపిస్తోంది.