ఏపీలో రాజకీయ పార్టీల పరిస్థితి పూటకో రకంగా …గంటకొక విధంగా అన్నట్టు తయారయ్యింది.కొంత కాలం ఒక పార్టీకి ఫుల్ జోష్ ఉన్నట్టు కనిపిస్తే మరికొంత కాలం మరో పార్టీకి జోష్ కనబడుతోంది.
ప్రాంతాన్ని బట్టి ఆ ప్రభావం మారుతూ వస్తోంది.తాజాగా ఇప్పుడు వైసీపీ లో ఎక్కడ లేని హుషారు కనబడుతోంది.
దానికి కారణం జగన్ పాదయాత్ర ఒకవైపు అయితే … తాజాగా విడుదలయిన వివిధ సర్వే ఫలితాలు వైసీపీ కి అనుకూలంగా రావడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి జనసేన భయం ఉన్నా … ఎన్నికల నాటికి పుంజుకుంటుందని నమ్మకం జగన్ లో కనిపిస్తోంది.
పార్టీలో నెలకొన్న విబేధాలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ఎన్నికలనాటికి మరింత బలపడాలని జగన్ చూస్తున్నాడు.
జగన్ ఇప్పటికే పదకొండు జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకున్నారు.మరికొద్ది రోజుల్లో విజయనగరం జిల్లాకు జగన్ పాదయాత్ర చేరుకుంటుంది.గత ఎన్నికల్లో దెబ్బతిన్న కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా, విశాఖ పట్టణంలో విపరీతంగా స్పందన రావడంతో.
అక్కడా ఆ పట్టు జారిపోకుండా చూసుకోవాలని జగన్ చూస్తున్నాడు.పాదయాత్ర ఒకవైపు నిరంతరంగా… సాగుతుండగా సర్వేలు కూడా తమ అధినేతకు అనుకూలంగా వస్తుండటం పార్టీ నాయకులకు హుషారు తెప్పిస్తోంది.
తాజాగా ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా సర్వేలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైపే ఎక్కువమంది ప్రజలు మొగ్గుచూపించడంతో ఆ పార్టీ నేతల్లో జోష్ నెలకొంది.చంద్రబాబు పాలనపై వ్యతిరేకత వ్యక్తమవుతుందని ఈ సర్వేలో తేలింది.జగన్ కు 43 శాతం మంది ప్రజలు మద్దతుగా నిలవగా, చంద్రబాబును 38 శాతం మంది సమర్థించారు.ఇక జనసేనాని పవన్ కల్యాణ్ ను కేవలం ఐదు శాతం మంది మాత్రమే ముఖ్యమంత్రిగా మద్దతు పలికారు.
జనసేన అధినేత పవన్ జిల్లా పర్యటన అనంతరం ఈ సర్వే జరిగింది.ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకూ 10,650 మందిని ఈ సర్వే ద్వారా ప్రశ్నించినట్లు ఆ సంస్థ తెలిపింది.
ఇక కాంగ్రెస్, టీడీపీ ఏపీలో జత కట్టినా పెద్దగా వైసీపీకి నష్టముండదని సర్వేలో తేల్చింది.ఏపీలో కాంగ్రెస్ ప్రభావం నామమాత్రమేనని సర్వే తేల్చింది.