తెలుగు మూవీ ఆర్టిస్టు అసోషియేషన్లో విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.మా అధ్యక్షుడు శివాజీ రాజా మరియు ఉపాధ్యక్షుడు శ్రీకాంత్లు అవినీతికి పాల్పడుతున్నట్లుగా ఒక దిన పత్రికలో కథనాలు వచ్చిన కారణంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెల్సిందే.
దాంతో శివాజీ రాజా మరియు శ్రీకాంత్లు ప్రెస్మీట్ నిర్వహించి తమ తప్పు లేదు అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.ఆ వెంటనే మా జనరల్ సెకట్రీ అయిన నరేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మా లో అవినీతి నిజమే అంటూ కుండబద్దలు కొట్టేశాడు.
మా సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం ప్రముఖులతో కార్యక్రమాలు చేయించాలని నిర్ణయించారు.అందుకోసం చిరంజీవి ముఖ్య అతిథిగా మొదటి కార్యక్రమం అమెరికాలో నిర్వహించతలపెట్టారు.చిరంజీవి కార్యక్రమం కోసం మొదట రెండు కోట్లు ఇస్తామన్న నిర్వాహకులు ఆ తర్వాత కోటి రూపాయలు మాత్రమే ఇచ్చారు.ఆ మిగిలిన డబ్బు శివాజీ రాజా వర్గంకు చేరిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక శివాజీ రాజాతో పాటు అమెరికాకు వెళ్లిన పలువురు మా సభ్యులు విమానంలో బిజినెస్ క్లాస్లో వెళ్లడం జరిగింది.ఒక్కో టికెట్ 3 లక్షల ఖర్చు పెట్టి బిజినెస్ క్లాస్లో వెళ్లవల్సిన అవసరం ఏంటని నరేష్ ప్రశ్నించాడు.
మా డబ్బును సొంత అవసరాలకు, జల్సాలకు వాడుకోవడం ఏంటని నరేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.తమ కుటుంబ నుండి నెలకు 15 వేల రూపాయలు మా కు వస్తుందని, తన తల్లి ప్రతి బర్త్డేకు 75 వేల విరాళంను ఇస్తూ వస్తున్నారు అంటూ నరేష్ చెప్పుకొచ్చాడు.ఇంత కాలం తాను మాట్లాడితే సిల్వర్ జూబ్లీ వేడుకలు రద్దు అవుతాయని, అందువల్ల తనను బ్యాడ్ చేస్తారని అనుకున్నాను.అందుకే మాట్లాడకుండా ఉన్నాను.ఇంకా నేను మాట్లాడకుండా ఉంటే చాలా పెద్ద తప్పు చేసిన వాడిని అవుతాను అంటూ ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.
మాలో జరిగిన అవినీతిపై నిజ నిర్థారణ కమిటీ వేయాలని నరేష్ డిమాండ్ చేశాడు.
దాదాపు 6 కోట్ల రూపాయల నిధి ఉన్న మా పై ప్రభుత్వ పెత్తనం అవసరం.అందుకే మా లో జరుగుతున్న అవినీతిపై సీనియర్ ఐపీఎస్ లేదా జడ్జ్తో కమిటీ వేయాలని నరేష్ డిమాండ్ చేశారు.
మా లో వర్గ పోరు తారా స్థాయికి చేరిన నేపథ్యంలో సినీ ప్రముఖులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.