అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి.అయితే ఈసారి మాత్రం ఆసక్తికర సంఘటన జరిగింది.
సాధారణంగా అక్కడ కాల్పులు సర్వసాధారణం.డబ్బు, గొడవలు, లింగ, వర్ణ, జాతి వివక్షలతో పాటు ఇతర కారణాల వల్ల అగ్రరాజ్యంలో తోటివారిపై కాల్పులకు తెగబడుతుంటారు ఉన్మాదులు.
గడిచిన కొన్నేళ్ల నుంచి ఇది మరింత ఎక్కువైంది.తుపాకీ తూటాలకు ప్రతి ఏటా వేలాది మంది బలవుతున్నారు.
ప్రతి నిత్యం దేశంలోని ఏదో ఒక మూల కాల్పుల శబ్ధం వినిపిస్తూనే వుంటుంది.తాజాగా జరిగిన ఘటనలో దుండగులకు ఎదురొడ్డి నిలిచిందో కుటుంబం.
వివరాల్లోకి వెళితే.రోడ్ ఐలాండ్ రాష్ట్ర రాజధాని ప్రొవిడెన్స్లోని వాషింగ్టన్ పార్క్ వద్ద వున్న ఓ ఇంటిపై గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో దుండగులు దాడికి తెగబడ్డారు.
అయితే ఈ ఇంట్లోని వారు ఏ మాత్రం బయపడకుండా వారిని ప్రతిఘటిస్తూ ఎదురు కాల్పులకు దిగారు.దీంతో ఇరుపక్షాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి.ఈ ఘటనలో ఇరు వైపులా తొమ్మిది మంది గాయపడగా.వీరిలో ముగ్గురి పరిస్ధితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.దాడికి దారి తీసిన పరిస్ధితులపై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రొవిడెన్స్ పోలీస్ చీఫ్ కల్నల్ హ్యూ టి.
క్లెమెంట్స్ వెల్లడించారు.
మరోవైపు, గత శనివారం న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కాల్పులకు పాల్పడిన ఘటనలో నిందితుడిగా అనుమానిస్తున్న ఫరాఖాన్ ముహమ్మద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇతనిని ఫ్లోరిడా రాష్ట్రం జాక్సన్విల్లెలోని మెక్డొనాల్డ్స్ స్టోర్ పార్కింగ్ వద్ద అరెస్టు చేసినట్లు న్యూయార్క్ పోలీసులు వెల్లడించారు.
కాగా, అత్యంత కట్టుదిట్టమైన భద్రత వుండే న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో కాల్పులు ఘటన జరగడంతో అధికారులు, స్థానికులు ఉలిక్కిపడ్డారు.ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి సహా ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యారు.శనివారం సాయంత్రం టైమ్స్ స్క్వేర్లోని 7వ అవెన్యూ, 44 స్ట్రీట్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
బ్రూక్లిన్లో నివసించే ఓ కుటుంబం టైమ్స్ స్క్వేర్ను తిలకించడానికి వచ్చింది.అదే సమయంలో తమ కుమార్తెకు బొమ్మలను కొంటుండగా.గుర్తు తెలియని వ్యక్తి ఒక్కసారిగా కాల్పులకు దిగాడు.ఈ ఘటనలో బాలిక (4)కు బులెట్ గాయాలయ్యాయి.
ఆ కుటుంబంతో సంబంధం లేని మరో ఇద్దరు మహిళలు సైతం గాయపడ్డారు.వారిలో ఒకరు రోడ్ ఐలండ్స్కు చెందిన యువతి (23) కాగా, మరొకరు న్యూజెర్సీకి చెందిన మహిళ (43)గా గుర్తించారు.